Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.19వేల కోట్ల అమ్మకాలు.. 58శాతం వృద్ధి
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సింగరేణి సంస్థ గడిచిన తొమ్మిది నెలల కాలంలో రికార్డు స్థాయిలో రూ.1,070 కోట్ల లాభాలు గడించింది. అద్భుతమైన టర్నోవర్ ఫలితంగా లాభాల్లో 227శాతం వృద్ధిని రికార్డు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.842కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2020- 2021వార్షిక సంవత్సరంలో కేవలం బొగ్గు ద్వారా రూ.9,525కోట్ల అమ్మకాలు జరిపింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులను కూడా అధిగమించి ఉత్పత్తి, రవాణాలను గణనీయంగా పెంచుకున్నది. తద్వారా 69శాతం వృద్ధితో రూ.16,110కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 52 శాతం వృద్ధితో 484లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.
మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 30శాతం వృద్ధితో 6,904మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. దీంతో గత ఏడాది సాధించిన రూ.2,461 కోట్ల రూపాయల అమ్మకాలపై 17శాతం వృద్ధితో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.2,892 కోట్ల అమ్మకాలు జరిపింది.
రికార్డు స్థాయిలో అమ్మకాలు, లాభాలు..
సీఎండీ శ్రీధర్ హర్షం
2021-22 ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల కాలంలో అమ్మకాలు, లాభాల్లో సింగరేణి గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంపై సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్పత్తి కోసం శ్రమించిన సింగరేణి అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. మిగిలిన మూడు నెలల కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్తు ఉత్పాదన కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గణనీయమైన వృద్ధితో సింగరేణి చరిత్రలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.27 వేల కోట్ల మేర టర్నోవర్, రికార్డు స్థాయి లాభాలు ఆర్జించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఏరియాల్లో పూర్తి స్థాయి యంత్ర వినియోగంతో రోజువారీగా, గనుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు, కార్మికులు అంకిత భావంతో పని చేయాలని కోరారు.