Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ గురుకులాల్లో చదివి మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లాప్టాప్లు, చెక్కులు అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు పొందిన వారికి అభినందనలు తెలిపారు. 2018-19,2019-20 విద్యా సంవత్సరాల్లో ఐఐటీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి రూ.50 వేలు, ఎన్ఐటీ, బీడీఎస్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.40 వేల చొప్పున చెక్కులు అందజేశారు. ఐఐటీ విద్యనభ్యసిస్తున్న వారికి ల్యాప్ టాప్స్ పంపిణీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహాకంగా రూ. 92 లక్షల 40 వేలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించటం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,జనరల్ గురుకుల విద్యా సంస్థల ద్వారా 5 లక్షల 40 వేల మంది విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. వీరికి కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, పుస్తకాలు,యూనిఫారంలు,బూట్లు అందిస్తున్నామన్నారు. లా, ఫైన్ ఆర్ట్స్,ఫిల్మ్ మేకింగ్,సైనిక్ స్కూల్, బాలికలకు డిగ్రీ కాలేజీలు నడుపుతున్నామని చెప్పారు. గురుకుల విద్యార్థులు పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ ఫలితాలతో పాటు జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నాని తెలిపారు. ఈసారి 240 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్లో 30మంది సీట్లు పొందనున్నారని పేర్కొన్నారు. ఐఐటీలో-84,ఎన్ఐటీలో-62,సెంట్రల్ యూనివర్సిటీలలో-27, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో -22 మంది సీట్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కులాల అభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ విద్యార్థులు, అధికారులు,సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతు నాయక్, సంయుక్త కార్యదర్శులు శారద, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.