Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమండలి ఎండీ దానకిశోర్
- ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్టీపీల నిర్మాణ పనులు పెండింగ్లో పెట్టవద్దని, ఆలస్యం అస్సలే చేయవద్దని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. కరోనా నియమాలు పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు నిర్వహించాలన్నారు. గురువారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో కొత్త ఎస్టీపీల నిర్మాణంపై మరోసారి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఎస్టీపీల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సైట్ల వద్ద ఉన్న అధికారులతో జూమ్ ద్వారా పనుల తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికులు, అధికారులు అన్ని కొవిడ్ జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అలాగే నిర్మాణ సైట్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే పలు ఎస్టీపీల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని, మిగతా ఎస్టీపీల వద్ద కెమెరాలు ఏర్పాటుచేసి ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు. పలు ఎస్టీపీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సాయిల్ టెస్టులు, డిజైన్ల తయారీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న చోట్ల సైట్ ఇంజనీర్ల కొరత లేకుండా చూసుకోవాలని, మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనులు జరగాల్సి ఉన్నందున, అందుకు సరిపడా సైట్ ఇంజనీర్లు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.