Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ డబ్బాతో తహసీల్లో మహిళ స్వీయనిర్భందం
- తలుపు తొలగించి పెట్రోల్ డబ్బాను లాక్కున్న వీఆర్వో
- న్యాయం చేయాలని బైటాయింపు
- టీఆర్ఎస్ మాజీ మహిళా మండలాధ్యక్షురాలి ఆవేదన
- అభివృద్ధి పేర గూడును కూల్చేశారని కన్నీటిపర్యంతం
నవతెలంగాణ-బెజ్జంకి
''పదిహేనుండ్లుగా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా.. పార్టీ మహిళా మాజీ మండలాధ్యక్షురాలుగా సేవలు అందించా.. మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులను చేపడుతుండగా.. నా ఇంటినే కూల్చి వేసి పనులకు శ్రీకారంచుట్టా.. గూడు పోయి ఏండ్లు గడుస్తున్నా అధికారు లుగానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుందనే నమ్మకంతో ఉన్న గూడును కూల్చివేశాననీ, ఇప్పటికీ ఇల్లు కేటాయిస్తలేరని.. తహసీల్దార్ కార్యాలయంలోకి పెట్రోల్ డబ్బాతో వచ్చి, ఓ గదిలో స్వీయ నిర్భందం చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో శుక్రవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఇరుమల్ల సుగుణ పదిహేనేండ్ల కిందట ప్రస్తుత మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. టీఆర్ఎస్ మహిళా మాజీ మండలాధ్యక్షులుగా కూడా పనిచేసి పార్టీ అభ్యున్నతికి కృషి చేశారు. అయితే నాలుగేండ్ల కిందట.. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు.. తన ఇంటిని కూల్చి వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ఎంపీపీ భర్త లింగాల లక్ష్మణ్ హామీ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుందనే నమ్మకంతో గూడును కూలగొట్టాననీ, అయితే నేటి వరకూ ఇల్లు కేటాయించలేదని వాపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెంది పెట్రోల్ డబ్బాతో తహసీల్కు వచ్చి.. ఓ గదిలో స్వీయ నిర్బంధం చేసుకుంది. విషయం తెలుసుకున్న వీఆర్వో శ్రీకాంత్ హుటాహుటినా తహసీల్కు వెళ్లి సదరు గది తలుపులు తొలగించి ఆమె చేతిలో నుంచి పెట్రో డబ్బాను లాక్కున్నాడు. తనకు న్యాయం జరిగే వరకూ వెళ్లేది లేదంటూ ఆమె అక్కడే బైటాయించింది. టీఆర్ఎస్ పార్టీలో చేరి తీవ్రంగా నష్టపోయానని ఆరోపించింది. స్థానిక ప్రజాప్రతినిధులు మాయమాటలు చెప్పి తన ఇల్లును కూల్చేశారని వాపోయింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని పలుమార్లు ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయింది.
ఈ ఘటనపై తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావును వివరణ కోరగా.. 48 డబుల్ ఇండ్లకు సుమారు 1400 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. జిల్లా పరిపాలనాధికారి, ఆర్డీఓ అధికారుల అధేశాల మేరకు లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను పై అధికారులకు అందజేస్తాన్నారు. వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడుతామన్నారు.