Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ అధికారుల దౌర్జన్యం
- అధికారుల వైఖరిని ఖండించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ- నేలకొండపల్లి
పంట రుణాలు మాఫీ చేస్తదని ఎదురుచూస్తున్న రైతులను ప్రభుత్వం నడిరోడ్డు మీద నుంచోబెట్టింది. మూడేండ్ల కిందట తీసుకున్న రుణాలు చెల్లించలేదని డీసీసీబీ అధికారులు రైతు కుటుంబాలను రోడ్డు మీదకు నెట్టి ఇండ్లకు తాళాలు వేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దెపల్లి గ్రామంలో రుణాలు సకాలంలో చెల్లించలేదనే కారణంతో శుక్రవారం డీసీసీబీ అధికారులు దౌర్జన్యంగా రుణ గ్రహీతల వస్తువులు జప్తు చేసి ఇండ్లకు తాళాలు వేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తొమ్మిది మంది లబ్దిదారులు స్థానిక డీసీసీబీలో జేఎల్జీ గ్రూపుల (జాయింట్ లయబిలిటీ గ్రూప్) పేరుతో గత 2017-18లో ఒక్కో సభ్యుడు రూ.20 వేల చొప్పున రుణాలు తీసుకున్నారు. ఇలా ఐదుగురు సభ్యులతో ఏర్పడిన జాయింట్ లయబిలిటీ గ్రూపులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు తీసుకున్నారు. ఇలా గ్రామంతో పాటు మండలంలోని కోరట్లగూడెం, బోదులబండ తదితర గ్రామాల్లోనూ సంబంధిత బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేశారు. రుణాల చెల్లింపుల నిమిత్తం లబ్దిదారులకు పలుమార్లు నోటీసులు సైతం జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. అయినా వారు స్పందించకపోవడంతో శుక్రవారం బ్యాంకు అధికారులు గ్రామానికి వెళ్లి టాటా ఏసీ వాహనంలో వారి ఇంటిలోని వస్తువులను జప్తు చేయడంతో పాటు ఇంటికి తాళాలు వేశారు. రుణ గ్రహీతలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బకాయి భారీగా పేరుకు పోయిందని బ్యాంకర్లు చెబుతుండగా రుణ గ్రహీతలు మాత్రం రుణాలు పొందే సమయంలో తాము తీసుకున్న రుణం కంటే కమీషన్ల పేరుతో బ్యాంకర్లు తీసుకున్న వాటానే అధికంగా ఉందంటూ కొంతమంది చెల్లింపులకు నిరాకరిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, గత రెండేండ్లుగా కరోనా మహమ్మారి ప్రభావంతో బతుకుదెరువు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, మరో పక్క ప్రకృతి వైపరీత్యాలతో పంటల దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందనీ, ఇప్పుడు మిర్చి పంటకు తామర పురుగు శించి పంటలు దెబ్బతింటే.. బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలంటూ ఇండ్లకు తాళాలు వేసి వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రుణాల వసూలు నిమిత్తం డీసీసీబీ నేలకొండపల్లి బ్రాంచ్ మేనేజర్ ఇందు, ఇతర సిబ్బంది, పోలీసులు మంది మార్బలంతో గ్రామానికి వచ్చి తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించకపోతే ఇండ్లలోని వస్తువులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరించినట్టు తెలిపారు. తాము దళితులము కావడం చేతనే అధికారులు తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలోని వస్తువులు జప్తు చేయడంతో పాటు ఇంటికి తాళం వేయడంతో చంటిపిల్లలకు ఆరు బయట ఉండాల్సిన పరిస్థితి దాపురించిందనీ, కనీసం భోజనం కూడా చేయలేదని వాపోయారు. దాంతో సీజ్ చేసిన తమ ఇంటి ముందే బాధితులు గత్యంతరం లేక ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) మండల మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి జరిగిన అన్యాయం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి మనోధైర్యం కల్పించారు. అప్పుల పేరుతో దౌర్జన్యంగా దళితుల ఇండ్లను జప్తు చేసి సీజ్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.ఇదే విషయమై సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ఇందును వివరణ కోరగా.. అప్పు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతోనే జప్తు చేయాల్సి వచ్చిందని తెలిపారు.