Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకులకు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ను శనివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బదిలీల వల్ల సుమారు 50 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. వారికి తిరిగి అవకాశం కల్పించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీల్లో అవకాశం కల్పించాలని సూచించారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వచ్చేనెల నాలుగో తేదీ వరకు పొడిగించడం పట్ల ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్కు ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జీసీసీఎల్ఏ నాయకులు ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.