Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత విద్యుత్కు సర్వీస్ చార్జీలు
- పంట సమయంలో స్టార్టర్లు లాక్కెళ్తున్న అధికారులు
- అప్పులు చేసి బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతలు
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
హత్నూర మండలం సికింద్లాపూర్కు చెందిన రాజయ్య తన రెండెకరాల పొలంలో వరి సాగు చేశాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పంపిణీ చేస్తున్నది ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వమే మాఫీ చేస్తుందనుకున్నాడు. 2014 నుంచి బిల్లు పెండింగ్లో ఉండటంతో రూ.8 వేలకు పెరిగింది. ఇటీవల తన పొలంలోకి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టార్టర్ను ఎత్తుకెళ్లారు. దీంతో చేసేదేం లేక అప్పుచేసి బిల్లు కట్టి స్టార్టర్ తెచ్చుకున్నాడు.
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా అడ్డంగులు ఎదురౌతున్నాయి. నిన్న మొన్నటి వరకు పండించిన పంటను మార్కెట్లలో అమ్ముకోవడానికి పోరాటాలు చేసిన రైతన్న.. యాసంగి పంట ఆరంభంలోనే విద్యుత్ అధికారుల అత్యుత్సాహానికి ఆగమాగం అవుతున్నాడు. పంటచేలకు నీరు పారకుండా చేస్తున్నారు. వ్యవసాయ బోరుబావులకు సర్వీస్ చార్జీలు కట్టలేదన్న సాకుతో విద్యుత్ శాఖ అధికారులు స్టార్టర్ డబ్బాలను తీసుకెళ్తున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఆరు గ్రామాల్లోని 85 మంది
రైతుల పొలాలకు విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. స్టార్టర్లను పీకి ఎత్తుకెళ్లారు. దీంతో చేసేదేం లేక రైతులు అప్పు చేసి బిల్లు చెల్లించి స్టార్టర్లను తెచ్చుకున్నారు. పెద్ద భూస్వాములను వదిలేసి బక్కచి రైతులను బలిచేస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత విద్యుత్ అంటూనే సర్వీస్ చార్జీలు వసూలు
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వం సర్వీస్ చార్జీల రూపంలో వసూలు చేస్తోంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ ఉన్న ప్రతి రైతూ నెలకు రూ.30 సర్వీసు చార్జీ కట్టాల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు నమ్మి.. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో చిన్న చిన్న బకాయిలు కాస్త.. వేలకు వేలయ్యాయి. ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన విద్యుత్ అధికారులు.. గ్రామాల్లో చాటింపులు చేయించి.. సరాసరి పొలాల్లోకొచ్చి స్టార్టర్లు పీక్కుపోతున్నారు.
ఒకే మండలంలో రూ.1.45 కోట్ల బకాయిలు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో విద్యుత్ బకాయిలు రూ.1.45 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంతకాలం పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి రైతులకు తెలియజేయకుండా.. పంట వేసే సమయంలో స్టార్టర్లను పట్టుకెళ్లారు. హత్నూర, సికింద్లాపూర్, బోర్పట్ల, కాసాల, నాగులదేవులపల్లి, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో బోరుబావుల స్టార్టర్లను తీసుకెళ్లారు. ఒక్కో రైతు రూ.2 నుంచి రూ.8 వేల వరకు బాకీ ఉన్నట్టు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. స్టార్టర్ డబ్బాలు తీసుకురావడంతో ఇప్పటికే కొందరు బిల్లులు కట్టారని చెప్పారు.
బిల్లులు కట్టాల్సిందే..
మాధవరెడ్డి- ఎస్ఈ- సంగారెడ్డి జిల్లా
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సర్వీస్ చార్జీలు నామమాత్రంగానే ఉన్నాయి. రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 బిల్లు వేస్తున్నాం. బిల్లు కట్టకపోతే పేరుకుపోతాయని.. నిర్లక్ష్యం చేస్తే స్టార్టర్లు తీసుకెళ్తామని ఎన్నోసార్లు రైతులకు తెలియజేశాం. అయినా పట్టించుకోలేదు. వేలల్లో బిల్లులున్న వారి స్టార్టర్లను తొలగించాం. బిల్లులు కట్టిన వెంటనే మళ్లీ బిగిస్తున్నాం. రైతులను వేధించాలన్నది మా ఉద్దేశం కాదు. కనీస బిల్లులు కూడా చెల్లించకుంటే ఎలా.. మా సంస్థను బతికించుకోవాలి కదా.
బిల్లు కట్టనిదే స్టార్టర్ ఇవ్వలేదు
విద్యుత్ బకాయిలపై మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ సారే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. అధికారులేమో బిల్లులు చెల్లించాలంటున్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారు.. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే బిల్లులు కట్టలేదు. ఇప్పుడేమో రూ.7800 బిల్లు కట్టమన్నారు. పంట వేసే కాలం.. వరి పంటకు బోరు నీరు ఆధారం. అందుకే తెలిసినోళ్ల దగ్గర అప్పుచేసి బిల్లు కట్టా.
- యాదయ్య - సికింద్లాపూర్