Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి...
- మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యం
- దేశాన్ని కాపాడేందుకు ప్రజా ఉద్యమాలను బలపర్చాలి
- సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్ శక్తులు
- కరోనా నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్రం
- ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో జనం విలవిల
- రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తున్న బీజేపీ : సీపీఐ(ఎం) ఆన్లైన్ బహిరంగసభలో సీతారాం ఏచూరి
- ఆస్తులన్నీ అమ్మేస్తున్న మోడీ : బృందాకరత్
- సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వవైభవం తేవాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలు శనివారం ఉత్సాహంగా, ఉత్తేజంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను నిర్వహించారు. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను అనుసరించి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సభకు సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షత వహించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్ వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. సీతారాం ఏచూరితోపాటు సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందా కరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి.జ్యోతి ప్రసంగించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులందరూ వేదికపై ఉన్నారు.
ఈ సందర్భంగా ఏచూరి ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ... దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిర్వహించే
ఉద్యమాలను బలపర్చాలని కోరారు. తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వవైభవం తేవాలనీ, దానికి ఉద్యమాలను బలపర్చడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఆర్థిక మందగమనం, ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించాలన్నారు. కరోనా నియంత్రణపై మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఈ అంశంలో రాష్ట్రాలకే బాధ్యత ఉంటుందని సలహా ఇస్తున్నదని చెప్పారు. అలాంటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోడీ బొమ్మ ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించారు. పౌరులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేదని అన్నారు. ఇంకోవైపు ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులు లూటీ చేస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నదని చెప్పారు. అన్ని రంగాలనూ ప్రయివేటీకరిస్తున్నారని అన్నా రు. ఇంకోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్ముతున్నదని ఎద్దేవా చేశారు. ప్రయివేటుపరం కాకుండా ప్రభుత్వరంగ సంస్థ ఒక్కటీ మిగల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీకి కార్పొరేట్ సంస్థల పొలిటికల్ ఫండ్
ఫిబ్రవరి 23,24 తేదీల్లో కార్మికవర్గం రెండురోజుల సమ్మె నిర్వహించబోతున్నదని ఏచూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా మోడీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడం కోసమే పనిచేస్తున్నదని చెప్పారు. ఆ తర్వాత బీజేపీకి ఆయా సంస్థలు లాభాల్లో నుంచి పొలిటికల్ ఫండ్ ఇస్తున్నాయని వివరించారు. దీన్నే క్రోనీకాపిటలిజం అంటారన్నారు. దేశంలో రాజకీయ కుంభకోణాలు లీగలైజ్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని చెప్పారు. 112 మంది శతకోటీశర్వుల వద్ద 55 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో దోపిడీ, ఆకలి తీవ్రమవుతున్నదని విమర్శించారు.
సామాజిక న్యాయం కాదు..అన్యాయం...
రాజ్యాంగ పునాదులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఏచూరి విమర్శించారు. ఆర్థిక సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేస్తున్నదని చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం కాదు.. అది అన్యాయానికి గురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని వివరించారు. రాష్ట్రాల పరిధిలోని అధికారాలను కేంద్రం గుంజుకుంటున్నదని చెప్పారు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయంపై కేంద్రం మూడు చట్టాలు తెచ్చిందనీ, విద్యుత్ సవరణ బిల్లును రూపొందించిందనీ, రాష్ట్ర జాబితాలోని విద్యారంగంపైనా నూతన విద్యావిధానాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర పరిధిలోని సహకార రంగాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకు ందనీ, అమిత్షా ఆ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నారని వివరించారు.కేంద్ర ప్రభుత్వం... సామాజిక న్యాయం, రాష్ట్రాల అధికారాలు,రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేయడం వరకే పరిమితం కాకుండా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.చర్చ లేకుండా చట్టాలు చేయటం ద్వారా బీజేపీ పార్లమెంటును రబ్బర్స్టాంప్గా మార్చిందన్నారు. సీఏఏ మీద, వ్యవసాయ చట్టాల మీద సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆ కేసులను స్వీకరించలేదని చెప్పారు. ఈసీని నిర్వీర్యం చేసిందన్నారు. యూపీలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా మోడీ, ఆదిత్యనాథ్ యోగిపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, ప్రశ్నించే వారిపై సీబీఐ,ఈడీని బీజేపీ ఏజెన్సీలుగా వాడుకుంటున్నదని అన్నారు.రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ అమిత్షా అంటున్నారని గుర్తు చేశారు. సీబీఐ,ఈడీని ప్రయోగించి ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురి చేయటం ద్వారా బీజేపీకి మద్దతిచ్చేలా ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్, మణిపూర్, కర్నాటకలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోరాడితే ప్రజలదే విజయం
రైతాంగ ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయమని ఏచూరి ఈ సందర్భంగా అన్నారు. 750 మంది అమరులైనా వెనుదిరగకుండా ఐక్యంగా ఉద్యమించి విజయం సాధించారని చెప్పారు. కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతాంగ విజయం ప్రజల్లో విశ్వాసం పెంచిందని వివరించారు. పోరాడితే ప్రజలదే విజయమని ఈ ఉద్యమం నిరూపించిందని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలనీ, ఐక్యఉద్యమాలను నిర్మించాలని చెప్పారు. ఇందుకోసం ఏప్రిల్లో కేరళలోని కన్నూర్లో జరిగే సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. వామపక్ష పార్టీలను కలుపుకుని మోడీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని అన్నారు.
ఎర్రజెండా.. పోరాడే వారికి ఆయుధం బృందాకరత్
కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్మేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పేరుతో రూ.6 లక్షల కోట్ల సంపదను విక్రయిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదం,నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమాజం కోసం, ప్రజల కోసం నిస్వార్ధంగా సేవ చేసే వారే కమ్యూనిస్టులని అన్నారు. హక్కుల కోసం పోరాడి వారికి ఆయుధమే ఎర్రజెండా అని చెప్పారు. రైతాంగం, కార్మికవర్గం, ఆదివాసీలు, మహిళలు పోరాడుతున్నారనీ, వారికి అండగా ఎర్రజెండా ఉందని అన్నారు. బారికేడ్లు, నిర్బంధాలు వారి ఐక్యతను ఏం చేయలేకపోయాయని చెప్పారు. ప్రత్యామ్నా య రాజకీయాల కోసం, సోషలిజం కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారని వివరించారు.బూర్జువా రాజ్యాంగమంటూ అమిత్షా అంటున్నారనీ,అందులోనూ లౌకికవాదం, ప్రజా స్వామ్యం,సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు వంటి మంచి అంశాలున్నాయని వివరించారు. లౌకికవాదంపైనా, మైనార్టీలపైనా, దళితులపైనా బీజేపీ దాడి చేస్తున్నదని విమర్శించారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ అనుసరించే మతోన్మాదం పై ప్రతిఒక్కరూ ఆలోచించాలని కోరారు.రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతున్నా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉద్యమించడం లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయా పార్టీలు ముందుకురావాలని కోరారు. కేరళ ప్రభుత్వం దేశానికే మోడల్గా నిలిచిందని చెప్పారు. దేశ ప్రజలంతా వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడాలని అన్నారు. సమాజహితం, ప్రజల సంక్షేమం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రజా తెలంగాణే ధ్యేయంగా ముందుకు.. :
బివి రాఘవులు
బంగారు తెలంగాణ నిర్మిస్తామంటూ ప్రజలకిచ్చిన హామీని పక్కన బెట్టిన రాష్ట్ర పాలకులు తమ స్వార్థం కోసం బంగారు గుడ్లు పెట్టే బాతుగా మలుచుకున్నారని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హామీలను పూర్తిగా విస్మరించారని చెప్పారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజాతెలంగాణ నిర్మాణం ఎలా సాధ్యమనే విషయంపైనా మహాసభలో చర్చిస్తామన్నారు. దేశ సగటు కంటే రాష్ట్ర అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉందనీ, అందులోనూ మహిళల అక్షరాస్యత రేటు ఇంకా దారుణంగా ఉందని వివరించారు. విద్యారంగంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలు పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పారు. విద్యాప్రమాణాలను మెరుగుపర్చాలనే చిత్తశుద్ధి పాలకుల్లో కొరవడిందనీ, ప్రజలు చైతన్యమైతే తమ ఆటలు సాగవనే ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నారని విమర్శించారు. కేరళ విద్యారంగంలో ప్రథమస్థానంలో ఉందన్నారు. ఆరోగ్యరంగమూ ప్రయివేటుపరం అయిపోయిందనీ, అదీ హైదరాబాద్ నగరం చుట్టే కేంద్రీకృతమైందని విమర్శించారు. గిరిజన, ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యసేవలు నేటికీ అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శిశుమరణాల రేటు వెయ్యిమందికి 23 ఉంటే తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య 30 మందిగా ఉందనీ, దీనిని బట్టే వైద్యసౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. తెలంగాణలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వాడుకోవడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పారిశ్రామిక రంగమూ హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతం కావడం వల్ల వలసలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణ మార్చడమే ధ్యేయంగా సీపీఐ(ఎం) ముందుకెళ్తున్నదని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు నష్టదాయకంగా ఉన్నాయనీ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. ప్రజల నుంచి భూములు సేకరించి నిర్మించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, ఎంతో విలువైన ఆ భూములను కార్పొరేట్లకు అమ్మేయాలని మోడీ సర్కారు చూస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో బోర్లమీద సాగు ఎక్కువనీ, కేంద్ర ప్రభుత్వమేమో ఉచిత విద్యుత్ను రైతులకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నదనీ, విద్యుత్ తయారీకి అయ్యే ప్రతిపైసానూ ప్రజల నుంచి వసూలు చేయాలని విద్యుత్ సవరణ బిల్లులో పొందుపర్చడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం కేంద్రం మీద పోరాటం చేయాల్సిన కేసీఆర్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ,బీజేపీ తనకు ప్రమాదంగా మారబోతుం దనే విషయాన్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు. దళితులు,మైనార్టీలు, మహిళలపై బీజేపీ వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) పోరాడుతుందని చెప్పారు. సామాజిక న్యాయం, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, మహిళల హక్కుల కోసం, అణచివేతలు, నిర్బంధాలపై సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని రాఘవులు చెప్పారు.
బీజేపీపై పోరులో కేసీఆర్ చిత్తశుద్ధి కనిపించట్లేదు..:తమ్మినేని
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ సకాలంలో వేసే శక్తి ఉన్నా కావాలనే మోడీ సర్కారు నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కమ్యూనిస్టు దేశాలైన చైనా, వియత్నాం, క్యూబా దేశాల్లో కరోనా వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయనీ, ఆయా దేశాలు కట్టడిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న తీరును వివరించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేసే ప్రభుత్వాలు అక్కడ ఉండటమే పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. మన దేశంలో నిరుద్యోగ సమస్యను అడ్డం పెట్టుకుని లాభాలు గడించడం ఎలా? కార్పొరేట్లు సంపద పోగేసుకోవడంలో సహకరించడం ఎలా? చివరకు శవాలపై పేలాలు ఏరుకుని లబ్ది పొందడం ఎలా? అనే అంశం చుట్టే మన పాలకుల ఆలోచనా విధానం తిరుగుతున్నదని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలన్నింటినీ బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని రావణకాష్టంగా మారుస్తున్నదని విమర్శించారు. రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ముందుకెళ్తున్నదనీ, దీంతో దేశం ప్రమాదకర స్థితిలోకి నెట్టబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. హరిద్వార్, ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే రాజ్యాంగం ఎక్కడ పోయింది? సైన్యం ఏమైంది? పోలీసు వ్యవస్థ ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ విషసర్పంలా ఎదుగుతున్న తీరును వివరించారు. ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలిచినా ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పడమంటే బెదిరింపులకు దిగడమేనన్నారు. సీబీఐ, ఈడీ, తదితర ప్రభుత్వరంగ సంస్థలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలను బెదిరించి లాక్కుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే ధ్యేయంగా బీజేపీ ముందుకెళ్తున్నదన్నారు. తమ ప్రధాన శత్రువు బీజేపీనే అనీ, ఆ పార్టీని నిలువరించడం ఎలా అనే అంశంపై మహాసభలో చర్చిస్తామన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దీనర్థం కేవలం ఎన్నికల రోజున ఓట్లు చీలకుండా చూడటమే కాదన్నారు. నాలుగేండ్ల 11 నెలల 29 రోజులు బీజేపీ ఎదుగుదలను అడ్డుకోకుండా కేవలం ఎన్నికల నాడే అడ్డుకోవడం అంటే అది సాధ్యమయ్యే పనికాదన్నారు. ఓట్లు చీలిపోకపోవడం ఒక్కటే సరిపోదన్నారు. బీజేపీ భావజాల వ్యాప్తిని కూడా అడ్డుకోవాలన్నారు. దాని విష ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక ప్రత్యామ్నాయ, లౌకిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ గడ్డపై సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు చేసిన ఘనత సీపీఐ(ఎం)కు ఉందనీ, భవిష్యత్లోనూ ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకుని ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ ప్రమాదాన్ని గుర్తించి పోరాడాల్సిన బాధ్యత ఒక్క కమ్యూనిస్టులపైనే లేదనీ, ఇతర పార్టీలపైనా ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పైన అది దాడి చేయట్లేదా? కేసీఆర్ను గద్దె దింపేందుకు చేయాల్సినదంతా చేయట్లేదా? దీన్ని కేసీఆర్ ఎందుకు గుర్తించడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కదానినైనా కేంద్రం నెరవేర్చిందా? బయ్యారం ఉక్కు కర్మాగారం, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు ఏమయ్యాయి? వాటిని ఎందుకు అమలు చేయట్లేదంటూ టీఆర్ఎస్ సర్కారు ప్రశ్నించిందా? ఈ విషయాలపై కేసీఆర్ పోరాటం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం హరించిందనీ, జీఎస్టీపై నష్టాన్ని కొన్నేండ్లపాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఈ రూపంలో వచ్చిన 16 వేల కోట్ల నష్టంపై కేరళ ప్రభుత్వం తరహాలో ఎందుకు పోరాటం చేయడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఉమ్మడి, రాష్ట్ర జాబితాల్లోని అంశాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర్రం ఉనికిని, ఆర్థికాభివృద్ధిని, ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంటే, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నాశనం చేయడానికి కుట్రలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని నొక్కిచెప్పారు. ప్రజలిచ్చిన అధికారాన్ని బీజేపీతో బేరసారాలు ఆడేందుకు, రాయితీలు పొందేందుకు, కుటుంబం, పార్టీ లబ్ది పొందడానికే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ పైకి బీజేపీపై పోరాడినట్టు నటిస్తున్నారని చెప్పారు. బీహార్ ప్రతిపక్షనేత, తమిళనాడు సీఎం, యూపీ ప్రతిపక్షనేతలను ఆయన కలవడం బాగానే ఉన్నప్పటికీ బీజేపీని నిలువరించాలనే ప్రయత్నాల్లో చిత్తశుద్ది కనిపించడం లేదన్నారు. ఏది చేసినా ప్రజలు నమ్మేలా చేయాలనీ, అలా చేస్తే హర్షిస్తామని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించాలని టీఆర్ఎస్ను నిలదీసే అధికారం సీపీఐ(ఎం)కి ఉందన్నారు. దాని అర్థం ఎన్నికలతో పొత్తు పెట్టుకుంటామని కాదన్నారు. బీజేపీపై పోరాడేందుకు కలిసొచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. ఎన్నికల పొత్తులకు కొన్ని విధానాలు ఉంటాయన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల పట్ల గౌరవం లేకుండా నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్ను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. సీఎం తనకు రాజకీయంగా అవసరమైనప్పుడు మాత్రం అపాయింట్మెంట్లు ఇవ్వడం, సమావేశాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నీళ్లు, నిధులు, నియామాకాలపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భూపంపిణీ ఏమైందని నిలదీశారు. హైదరాబాద్ నగరంలోని, గ్రామాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి ఎర్రజెండాలు పాతుతామనీ, పంపిణీచేసే ధైర్యం కేసీఆర్కు ఉందా..? అని ప్రశ్నించారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భూ, ధరణి సమస్యలు, పోడు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు : చెరుపల్లి
తెలంగాణలో సాగిన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెరుపల్లి సీతరాములు అన్నారు. నాడు వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాగిన ఆ పోరాటం దొరలు, భూస్వాములు ప్రజలపై చేసిన అకృత్యాలను వీరోచితంగా ఎదుర్కొన్నదని చెప్పారు. నాటి దోపిడి,దురాగాతాల రూపాలు ప్రస్తుతం మారాయని వివరించారు. వాటిపైనా పోరాడాలని పిలుపు నిచ్చారు.
మహిళలపై లైంగిక దాడులు ఆందోళనకరం : జ్యోతి
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి చెప్పారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ తమ పార్టీ అక్కడ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించటానికి వీల్లేదని చెబితే.. ధర్నా చౌక్ కావాల్సిందేనంటూ ఉద్యమాలు నిర్వహించామని గుర్తుచేశారు.దేశంలో,రాష్ట్రంలో ఆర్థిక అసమానతులు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. మోడీ పాలనలో మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.మహిళలను రెండో తరగతి పౌరులుగానే ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. సాధికారిత అంటూనే అభివృద్ధికి వ్యతిరేక విధానాలను రూపొందిస్తున్నారని చెప్పారు.అందులో భాగంగానే పెండ్లీడు వయస్సు పెంపు, సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో పొందుపర్చిన ప్రశ్నలంటూ ఉదహరించారు.
ప్రత్యామ్నాయం చూపేది ఎర్రజెండే.. : జూలకంటి
ప్రతీ ఎన్నికల తర్వాత పాలకులు మారుతున్నారు తప్పితే...ప్రజల కష్టాలు మాత్రం తీరటం లేదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో,రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే..నీళ్లు, నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పి నమ్మించిన టీఆర్ఎస్...ఇప్పుడు వాటిని మరిచిపో యిందని విమర్శించారు.మిగతా ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సామాన్యులు అందుకోని రీతిలో నిత్యావసర ధరలు పెరుగుతు న్నాయని చెప్పారు. మరోపక్క పన్నుల భారం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగాన్నంతా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలకు బీజేపీ పూనుకుంటున్నదని చెప్పారు.ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నా యని వివరించారు.ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రత్యామ్నాయ అజెండాను ఎర్రజెండా ముందుకు తెస్తుందని తెలిపారు. ఈ దిశగా మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వివరించారు.