Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు మంత్రి కొప్పుల, సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు అమలును వేగవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు దళితబంధుపై కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయం కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ పాల్గొన్నారు. 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని.. 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1200 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామనీ, విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్క లబ్ధిదారునికి మంజూరైన రూ.10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేక దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలనీ, స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ. 1200 కోట్ల కేటాయించామనీ, ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసామని తెలిపారు. వాసాల మర్రి, హుజురాబాద్లలో దళిత బంధు అమలులో ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా అమలు చేస్తున్నామన్నారు.