Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పనులకు బ్యాంకు రుణాలు
- బల్దియా అప్పులు రూ.5 వేలకోట్లపైనే..
- రూ.858 కోట్లతో నాలా పనులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'గ్రేటర్ హైదరాబాద్లో నాలాలు, డ్రయినేజీల అభివృద్ధి చేయాలంటే రూ.10 వేల కోట్లు అవసరం. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చెరువుల పరిరక్షణ, వరదల నివారణకు చర్యలు తీసుకుంటాం' అని 2016 వరదల నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ, ఐదేండ్లలో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రయినేజీల నిర్మాణానికి నాలుగేండ్లుగా ఏటా రూ.300 కోట్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో భారీ వర్షాలు, వరదలకు నగరం అతలాకుతలమైంది. దీంతో ప్రభుత్వం రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ)ను ప్రారంభించింది. కానీ గ్రేటర్లో పూర్తిస్థాయిలో నాలాలు, డ్రయినేజీలను అభివృద్ధి చేయాలంటే జీహెచ్ఎంసీ రూ.10 వేల కోట్లను ఖర్చు చేయలేని స్థితిలో ఉంది. సర్కార్ సైతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దీంతో అప్పులు చేయడమే బల్దియా ముందున్న కర్తవ్యమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పనుల కోసం జీహెచ్ఎంసీ రూ.5 వేల కోట్లకుపైగానే అప్పులు చేసింది.
అధ్యయనాలతోనే..
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల స్థితిగతులపై మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిర్లోస్కర్ కమిటీ 2003లో నివేదిక ఇచ్చినప్పుడే వరద ముప్పునకు కారణాలను సవివరంగా అందజేసింది. నగరంలో చెరువులు కనుమరుగవ్వడం, నాలాలు, చెరువులు కుచించుకపోవడం, డ్రయినేజీల్లో చెత్తను, ఇతర వ్యర్థపదార్థాలను పడవేయడం, చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు వచ్చాయని కమిటీ పేర్కొంది. ఇలాంటి చర్యల వల్లే నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు, వరదలకు తట్టుకోలేని స్థితికి చేరుకున్నాయని కమిటీ గుర్తించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ వయాంట్స్ అనే కన్సల్టెన్సీతో 2007లో అధ్యయనం చేయించింది. కిర్లోస్కర్, వయాంట్స్ కమిటీల నివేదికలను పరిశీలించడంతోపాటు ఎన్సీపీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఫీజుబులిటీ ఎంతవరకు ఉందనే అంశాన్ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
అప్పులు ఇలా..
జీహెచ్ఎంసీ నిర్వహించే పనులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అంచనాతో ఎస్ఆర్డీపీ, రూ.1839 కోట్లతో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ), రూ.1500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణ పనులను చేయాలని నిర్ణయించింది. కానీ వీటికయ్యే నిధులను మాత్రం సర్కార్ ఇవ్వకపోగా అప్పులు తీసుకుని పనులు చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. అందులో భాగంగానే బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, రూపీ టర్మ్లోన్ ద్వారా రూ.2,500 కోట్లు, సీఆర్ఎంపీ కోసం రూ.1,460 కోట్లను బ్యాంకు లోన్ ద్వారా సేకరించారు. దీంతోపాటు మధ్యలో ఆగిపోయిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను పూర్తిచేయడానికి మరో రూ.337 కోట్లు బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పులు భారీగా పెరిగిపోయి బల్దియా క్రెడిట్ రేటింగ్ దిగజారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాండ్లు, బ్యాంకు రుణాలకు నెలకు రూ.30 కోట్లు వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.120కోట్లకుపైగా పెరిగే అవకాశముందని తెలిసింది.
ఎస్ఎన్డీపీకీ అంతే..
జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, డ్రయినేజీ, చెరువుల లింకు అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ రూ.858 కోట్లు కేటాయించింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోని పనులకు రూ.633 కోట్లు, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు రూ.225 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయినా, జీహెచ్ఎంసీ పనులు పూర్తికావాలంటే అప్పులు చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. అందుకోసం బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.