Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేటు లాడ్జీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, గోపాలపేట, హనుమండ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిరువటి మన్నెం(51) జ్యోతిష్యం, నాటు మందులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19న మయూరి సెంటర్లోని వినోద మహాల్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి లాడ్జీలో ఉంటూనే 21వ తేదీన లాడ్జి బారుతో కల్లు తెప్పించుకుని తాగాడు. అనంతరం రూంలోకి వెళ్లిన మృతుడు బయటకు రాలేదు.
గది అద్దెకు తీసుకునే సమయంలో రెండు రోజులకు మాత్రమే అద్దె చెల్లించడంతో లాడ్జి సిబ్బంది ఆదివారం అతని గది తలుపులు కొట్టి పిలువడంతో స్పందన కనిపించలేదు. గది కిటికీ నుంచి పరిశీలించగా ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుని వద్ద లభించిన ఆధార్, రేషన్, ఓటరు కార్డుల ఆధారంగా సెల్ నెంబర్ సహాయంతో బంధువులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్ధం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య 20 ఏండ్ల క్రితమే ఒదిలేసి వెళ్లిపోయింది. కుమార్తె ఒక్కతే ఉండటంతో సమాచారం అందించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు కారణాలు ఏమి తెలియలేదనీ, ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాడ్జీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి. వెంకన్న తెలిపారు.