Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యలను జోడించి కొత్త కళా రూపాలు సృష్టించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని మఖ్డూమ్ భవన్లో తెలంగాణ ప్రజానాట్య మండలి మూడురోజుల కవులు, కళాకారుల వర్క్ షాప్ ముగింపు సమావేశం తెలంగాణ ప్రజానాట్య మండలి అధ్యక్షులు కె. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాల వల్ల ప్రజలు తమ దేశంలోనే బానిసత్వంతో కూడిన జీవితాన్ని గడపవలసివస్తుందని ఆరోపించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధికి దూరమవుతున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వ తీరుతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజా ఉద్యమాలకు ఉపిరిపోసేదే ప్రజాకళాకారుల పాటలేననీ, అరసం కవులు, ప్రజానాట్య మండలి కళాకారులూ ప్రజల మధ్యకు పోయి ప్రజల్లో తమ పాటల ద్వారా చైతన్య స్ఫూర్తి నింపే దిశగా తమ కార్యాచరణాలను రూపొందించుకోవాలని కోరారు. వర్క్ షాప్ ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఉప్పలయ్య, రాష్ట్ర నాయకులూ బి. జగన్, కె. లక్ష్మి నారాయణ, విజరు, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.