Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీటా గ్లోబల్ సింపోజియంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సమాజంలోని వివిధ సమస్యలకు టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర వ్యవవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. టీహబ్లో నిర్వహించిన టీటా గ్లోబల్ సింపోజియంను వర్చువల్లో ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రికల్చర్లో టెక్నాలజీ అనుసంధానంపై యువ ఇంజినీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సమాజంలోని అన్ని రకాలైన అంశాలకు చెందిన సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం చూపేందుకు టీటా చేస్తున్న కృషిని ప్రసంసించారు. ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు రక్షణ రంగానికి చెందిన అంశాలపై కూడా టీటాకు చెందిన ఇంజినీర్లు సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలు రూపొందించడం సంతోషమన్నారు. జేఎన్టీయూ డైరెక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ, విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి టీటా తో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఐ హబ్ చైర్మెన్ డాక్టర్ కల్పన మాట్లాడుతూ అన్నదాతలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ఉత్తమమార్గంగా నిలుస్తాయన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ బిక్షపతి, కిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రత్యూష , నిమ్స్ వైద్యులు రమేష్ మార్తా వైద్యరంగంలోని సవాళ్లను వివరించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తల మాట్లాడుతూ గత 12 ఏండ్లుగా దాదాపు 50 దేశాలకు పైగా టెక్కీలతో టీటా సింపోజియంను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు.