Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్క బావల హింస భరించలేను
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఓ బాలుడు వినతి
నవతెలంగాణ-నేలకొండపల్లి
''తన అక్కా బావలు పెట్టే హింస భరించలేకపోతున్నాను. తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి మహాప్రభో!'' అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఓ బాలుడు వేడుకున్న విషాదగాథ ఆదివారం చర్చనీయాంశంగా మారింది. బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన గోరంట్ల సాయిచందు(17) పదవ తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు గోరంట్ల లక్ష్మీనారాయణ, సుజాత. మండలంలోని బుద్ధారం గ్రామంలోని పాఠశాలలో తండ్రి మ్యాథ్స్ టీచర్గా పని చేసేవారన్నారు. అతని మరణానంతరం తన తల్లికి పాఠశాలలో అటెండర్గా ఉద్యోగం కల్పించారు.
అ ఉద్యోగం కోసం.. అదే గ్రామానికి చెందిన తన అక్క, బావ.. తన తల్లి ఆరోగ్యం బాగా లేదని హుజూర్నగర్లో ఓ కార్పొరేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందిస్తామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మక్కయి కరోనా పేరుతో తన తల్లిని చంపేశారని సాయి చందు ఆవేదన వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని ఎందుకు తీసుకురాలేదని అక్క బావలను అడగగా ''నోరు మూసుకో.. నీకేమీ తెలియదు.. ఎక్కువ మాట్లాడితే చంపేస్తాం' అంటూ బెదిరించారని చెప్పాడు. మా అమ్మ ఉద్యోగం మా అక్కకు ఇవ్వాలంటూ బావ తనను నిత్యం హింసిస్తున్నాడని, అది భరించలేక తన మేనమామ ఇంటికి వెళ్లినట్టు తెలిపాడు. ఈ బుధవారం పాఠశాలకు చెందిన టీచర్ ఫోన్ చేసి పాఠశాలకు రావాలని చెప్పడంతో అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను పాఠశాలకు తెలిపేందుకు తిరిగి ఇక్కడికి వచ్చినట్టు తెలిపాడు.
నేను ఇక్కడికి రాకముందే తమ అద్దె ఇంటిలోని సామాన్లుతో పాటు సర్టిఫికెట్లను కూడా తమ అక్కా బావలు తీసుకెళ్లారని తన వద్ద ఏమీ లేకుండా చేశారని బాలుడు వాపోయాడు. నేలకొండపల్లిలో తనకు తెలిసిన వారు ఆశ్రయం ఇవ్వడంతో వారి వద్దనే ఉంటున్నానని తెలిపాడు. తాను మేనమామ వద్ద ఉండగానే తన అక్క బావలు సదరు ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేశారని చెప్పాడు. ఈ విషయంపై తనకు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వారిపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విధంగా అక్క, బావ పెట్టే బాధ, హింసను భరించలేకే చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.