Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ వ్యాప్తి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-సుబేదారి
వడగండ్లతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టం, కోవిడ్ వ్యాక్సినేషన్, జ్వర సర్వే, దళితబంధు అమలుపై హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, డాక్టర్ గోపీ, వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులతో ఆదివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వర్షానికి సుమారు 51వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు, 35 వేలకుపైగా రైతులు నష్టపోయినట్లుగా అంచనాలు అందాయని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాల్లో జ్వర సర్వేను విజయవంతం చేయాలని చెప్పారు. దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ విషయంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు చికిత్స అందించేలా ఆక్సీజన్తో కూడిన ఐసీయూ బెడ్లను అన్ని పీహెచ్సీల్లో, సీహెచ్సీల్లో, జిల్లా ఆస్పత్రుల్లో సిద్ధం చేయాలని చెప్పారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని తెలిపారు. దళితబంధు అమలు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 5 లోగా వంద మంది చొప్పున ఎంపిక చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, రవీందర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్మెన్ డాక్టర్ సుధీర్కుమార్, తదితరులు పాల్గొన్నారు.