Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలతో మమేకమై పనిచేయాలి
- మహాసభల్లో రాజకీయ నివేదిక సమర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్
(తుర్కయాంజాల్) నుంచి బి.బసవపున్నయ్య
పార్టీ పూర్తికాలం కార్యకర్తలు, నాయకులు, సభ్యులు విప్లవపంథాను అలవర్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ ఎదగాలంటే సైద్ధాంతిక అవగాహనను మరింత పెంచుకోవడంతోపాటు ఆచరణలో మాస్లైన్తో కీలకంగా ఉండాలని సూచించారు. ఆదివారం నాడిక్కడ ప్రారంభమైన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో ఆయన రాజకీయ నివేదికను సమర్పించారు. సరైన రాజకీయ విధానంతో ముందుకుపోతే ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని నిలదీస్తూనే టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పోడుభూముల పోరాటం అద్బుతమని పార్టీ శ్రేణులను ప్రశంసించారు. ఫ్యూడల్ స్వభావంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆయన్ను వేడుకుంటేనే సమస్యలు పరిష్కరిస్తాననే ధోరణితో ఉన్నారనీ, డిమాండ్ చేస్తేనో, ఉద్యమిస్తేనో పట్టించుకోవడం లేదని చెప్పారు. వందలాది సమస్యలపై స్థానికంగా పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాసంఘాల పాత్ర కీలకమని వివరించారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉద్యమాలు నిర్మించాలన్నారు. కరోనా కాలంలో పార్టీ, ప్రజాసంఘాలు చేసిన కృషికి అన్ని తరగతుల నుంచి ప్రశంసలు వచ్చాయని వివరించారు. ఐక్య ఉద్యమ నిర్మాణం ద్వారా పోడు ఆందోళనను నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతర తరగతుల సమస్యలపై పూర్తిస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. లెనిన్ కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. సామాజిక సమస్యలపై అన్ని ప్రజాసంఘాలు పనిచేయాలనీ, పార్టీలో మహిళలు, యువతపాత్ర పెరిగిందనీ, వారి సహకారం లేకుండా ఉద్యమాలు సక్సెస్ కావని అభిప్రాయపడ్డారు. సోషల్మీడియా ప్రాధాన్యత పెరిగిందనీ, ఐటీ రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కరోనాతో పార్టీ, ప్రజాసంఘాలు, ప్రజలకు నష్టం జరిగిందన్నారు. అదే సమయంలో పార్టీ యంత్రాంగానికి సైద్దాంతిక విద్యను అందించే అవకాశమూ కలిగిందన్నారు. సమాజ పరిణామాలను ప్రజలకు అర్థం చేయించాలనీ, ఆ విధంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తూ ముందుకు సాగాలని కోరారు. రాజకీయ శత్రువైన బీజేపీని అడ్డుకోవాలన్నారు. సమస్యలపై టీఆర్ఎస్ సర్కారును ప్రశ్నిస్తూనే, బీజేపీకి వ్యతిరేకంగా కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. భూమి, కూలి, నిరుద్యోగం, సామాజిక సమస్యలపై పనిచేయాలని సూచించారు.