Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దిశగా అడుగులు పడాలి..
- ఆశాజనకంగా యువ నాయకత్వం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్
(తుర్కయంజాల్) నుంచి అచ్చిన ప్రశాంత్
దేశంలో వామపక్షాల ఐక్యతను బలోపేతం చేసుకుంటూనే కమ్యూనిస్టుల పునరేకీకరణ దిశగా అడుగులు వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల్లో ఆయన సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు విరుద్ధంగా మోడీ పాలన సాగుతున్నదనీ, ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పరిపాలన జరుగుతున్నదని విమర్శించారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగంగా ఒత్తిడి చేసి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా వామపక్షాలు కాపాడాయనీ, కరోనా సమయంలో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నా మన ఆర్థిక పూర్తిగా దెబ్బతినకుండా ఉండటంలో వామపక్షాలదే కీలక పాత్ర అని వివరించారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. సాగుచట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిందన్నారు. మతోన్మాద చర్యలు విచ్చలవిడిగా పెరిగిపోయాయనీ, దళితులు, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై రాజద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. రాజులు, రాజ్యాలు పోయినా..ఇంకా రాజద్రోహం కేసులు ఏంటి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినా మోడీ సర్కారు ఏమాత్రం బిడియపడట్లేదని అన్నారు. బీజేపీ ఉంటే భవిష్యత్లో ప్రజాస్వామ్యం ఉండదనీ, భావసారూప్యత పార్టీలను కలుపుకుని వామపక్షాలు ముందుకు సాగాలనీ చెప్పారు. రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ సర్కారు పాలన ప్రజాస్వామ్యయుతంగా జరగట్లేదని విమర్శించారు. భూమి, నిరుద్యోగం, పోడు భూముల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. సాయుధపోరాట వారసత్వ పునాదుల మీద వామపక్ష శక్తులు తెలంగాణలో బలోపేతం అవుతూ, వర్గపోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.