Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) ప్రతినిధుల సభలో సీతారాం ఏచూరి
- ప్రజా ఉద్యమాలను బలపర్చటమే మార్గం
- వామపక్షాలు బలపడాలి
- ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకుని పోవాలి : సీపీఐ(ఎం) ప్రతినిధుల సభలో సీతారాం ఏచూరి
- ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే బీజేపీ లక్ష్యం
- అమెరికా ముందు మోడీ తోలుబొమ్మ
- నాటి హెచ్చరికలే.. నేడు నిజమయ్యాయి
కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్
(తుర్కయంజాల్) నుంచి బి.వి.యన్.పద్మరాజు
ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరముందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు. ప్రజా ఉద్యమాలను బలపర్చటమొక్కటే దీనికి మార్గమని చెప్పారు. ఇందులో భాగంగా మొదట వామపక్షాలు బలపడాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకోవాలని సూచించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభలో రెండో రోజైన ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభలో ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో ఆరెస్సెస్ ఫాసిస్టు అజెండాను అమలు చేయటమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని గుర్తు చేశారు. అది ఈనాడు నిజమవుతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహౌత్సవాల్లో 'దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటమే మా లక్ష్యం...' అంటూ బీజేపీ ప్రకటించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఆ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత...దేశ సంపదను కార్పొరేట్లకు శరవేగంగా ధారాదత్తం చేస్తున్నదని తెలిపారు. కార్మికుల హక్కులు, అధికారాలను హరించి వేస్తున్నదన్నారు. మరోవైపు రాజకీయ అవినీతి అనేది 'లీగలైజ్డ్ పొలిటికల్ కరప్షన్...'గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్ -370, 35 (ఎ) రద్దు, సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్లను ముందుకు తెచ్చిందన్నారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నదని వివరించారు. ఇదే సమయంలో బీజేపీ చర్యలు, విధానాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు బలపడుతున్నాయని ఏచూరి గుర్తు చేశారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనేక విషయాల్లో అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్... దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని తెలిపారు. ఆ దేశం ముందు ప్రధాని మోడీ...తోలు బొమ్మలా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రానంతరం... దేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని గుర్తుచేశారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, సమైక్యతను దృష్టిలో ఉంచుకుని ఆనాటి నాయకులు ఇలాంటి అంశాలను రాజ్యాంగంలో చేర్చారని తెలిపారు. ఇది నచ్చకే ఆరెస్సెస్... గాంధీని హత్య చేయించిందని అన్నారు. తమ లక్ష్యాల్లో భాగంగా మహమ్మద్ అలీ జిన్నా ఇస్లామిక్ రిపబ్లిక్ (పాకిస్తాన్)ను స్థాపించారని తెలిపారు. కానీ ఇక్కడ (ఇండియాలో) హిందూ రాష్ట్ర స్థాపన అనే ఆరెస్సెస్ అజెండా ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఆ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తన అజెండా అమలుకు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర అనేవి అడ్డంకిగా ఉన్నాయని భావించిన బీజేపీ... ఇప్పుడు రాజ్యాంగాన్ని, దాని మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తున్నదని హెచ్చరించారు. రాజ్యాంగ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఎన్నికల సంఘం (ఈసీ)తోపాటు న్యాయ వ్యవస్థను సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలపై కేసులు పెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని వివరించారు. మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చెలాయిస్తున్నదని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ బొమ్మలు ముద్రించి ఉన్న సంచుల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేశారని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమనీ, అయినా నేటి వరకూ ఎన్నికల సంఘం స్పందించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి అంశాలన్నింటిపై మహాసభలో సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయాలని ఏచూరి పిలుపునిచ్చారు.