Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్
(తుర్కయాంజాల్) నుంచి గుడిగ రఘు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని సీపీఐ(ఎం) మూడో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో విప్లవ వారసత్వం ప్రతి ఊర్లోనూ ఉన్నదనీ, దీనికి ఆనాడు అమరులు చేసిన త్యాగాలే కారణమని చెప్పారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడిన యోధుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లోని సున్నం రాజయ్యనగర్లో సీపీఐ(ఎం) మూడో మహాసభల ప్రారంభంలో ఆహ్వాన సంఘం తరుపున చెరుపల్లి అధ్యక్షోపన్యాసం చేశారు. సాయుధ పోరాట కాలంలో ఈ ప్రాంతంలో పేదలకు వేల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఉందన్నారు. రాచకొండ గుట్టల కేంద్రంలో కృష్ణమూర్తి దళం పని చేస్తూ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూస్వాములు , పటేల్, పట్వారీల చేతుల్లోని గిరిజన, దళితుల భూములను విడిపించి పేదలకు పంచారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో భూపోరాటాలే ప్రధాన ఎజెండాగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కేంద్రీకృతం కావడం వల్లే దేశం నలుమూలాల నుంచి కార్మికులు ఉపాధి కోసం వచ్చారని తెలిపారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. రానున్న కాలంలో భూపోరాటాలతో పాటు కార్మిక, కర్షక వర్గ పోరాటాలు తీవ్రతరం చేస్తామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమించడంలో, ప్రత్యర్థులను ఎదిరించడంలోనూ మహబూబ్పాషా, నరహరి ఎంతో ధైర్యాన్ని, తెగువను ప్రదర్శించారని చెప్పారు. పెట్టుబడిదారులను ప్రశ్నించే తత్వాన్ని ఓర్వలేని మతోన్మాద శక్తులు మాటు వేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కొండిగారి రాములు, మస్కు నర్సింహ పేదల పక్షాన అసెంబ్లీలో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దళిత, గిరిజన, నిరుపేదలకు వందలెకరాలకు పట్టాలిప్పించారని తెలిపారు. ఇప్పటికీ బలమైన ఉద్యమ కేంద్రాలుగా ఉన్న ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలుపొందుతున్నారని చెప్పారు. ఫార్మాసిటీ కోసం పేదల నుంచి 19వేల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనీ, దీనికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. భూపోరాటంలో ఎంతో మంది నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాలోని మిగులు భూములు, వక్ఫ్బోర్డు, ప్రభుత్వ భూములను పేదలకు పంచడమే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. పోడు, అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు కోసం ఉద్యమించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలందరికీ అందేలా ఉద్యమాలు చేపడతామని చెప్పారు.