Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ- దామరచర్ల
లైంగిక వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక సపావట్ రమాదేవి(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన బాలిక బంధువైన భూక్యా కృష్ణ వివాహితుడు. అతనికి ఇద్దరు సంతానం ఉన్నారు. భూక్యా కృష్ణ ఆరు నెలలుగా బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బాలిక కుటుంబసభ్యులకు చెప్పడంతో.. వారు పద్ధతి మార్చుకోవాలని కృష్ణను హెచ్చరించారు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాలేదు. తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగిపోయిన బాలిక ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.