Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికత్వ పరిరక్షణకు రామానుజే ప్రేరణ
- గోడకు చెప్పినా.. మోడీకి చెప్పినా ఒక్కటే..
- కేసీఆర్ విమర్శలను ఆహ్వానిస్తున్నాం..
- నదుల నీళ్లను వెనక్కు తీసుకెళ్లే అధికారం కేంద్రానికి లేదు
- పోడు సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ పోరాటం
- 9,10 తేదీల్లో గుండాల,టేకులపల్లి మండలాల్లో పర్యటన : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రామానుజాచార్యుల సమతాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా మోడీ ప్రభుత్వ పాలన ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రామానుజుడు అసమానతల నిర్మూలన కోసం పాటుపడితే బీజేపీ ప్రభుత్వం ఆ అసమానతలను పెంపొందిస్తోందన్నారు. ప్రధాని హౌదాలో రామానుజాచార్యుడి సహస్రాబ్ది సమారోహానికి మోడీని ఆహ్వానించడం సహేతుకమే అయినా మోడీ పాలనను శ్రీరామ రాజ్యంగా పోల్చడంలో చినజీయర్ ఔచిత్యం సరైంది కాదన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం సుందరయ్య భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నందుకా? మనువాదం, మతోన్మాదాలను ప్రోత్సహిస్తున్నందుకా? కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నందుకా? రైతులు, కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసేలా నల్లచట్టాలు తెచ్చినందుకా? దేనిలో మేటి అని మోడీ పాలన శ్రీరామ రాజ్యం వలే సుభిక్షంగా ఉందని చినజీయర్ విశ్లేషణ చేశారని ప్రశ్నించారు. మోడీ పాలనలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోయాయని ఆరోపించారు. సామాజిక న్యాయం ఊసేలేని రాక్షస చట్టాలు అమల్లోకి తెచ్చారని తెలిపారు. మోడీ పాలన ఈ దేశాన్ని దివాళా తీయించేలా ఉందన్నారు. 'గోడకు చెప్పినా.. మోడీకి చెప్పినా ఒక్కటే' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందనే కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. పోడు సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరిని ఖండించారు. పోడుదారులకు పట్టాలు ఇవ్వకపోగా 2005కు ముందు స్వాధీనంలో ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, టేకులపల్లి తదితర మండలాల్లో పోడురైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, ఈనెల 9, 10 తేదీల్లో ఆ మండలాల్లో బాధితులను కలుస్తామని తెలిపారు. పోడు సమస్యలను పరిష్కరించకపోతే టీఆర్ఎస్, బీజేపీయేతర అఖిలపక్షం ఆధ్వర్యంలో మళ్లీ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో కృష్ణా, గోదావరి, కావేరి నీటి అనుసంధానం పేర్కొనడం సరైంది కాదన్నారు. బచావత్ కమిటీ సిఫారసుల మేరకు రెండు నదుల నీళ్లను వెనక్కు తీసుకెళ్లే అధికారం కేంద్రానికి లేదన్నారు. కాళేశ్వరంతోనే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కాదనే విషయాన్ని కేసీఆర్ గ్రహించాలన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.