Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థ పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం దేనికైనా సై...
- ఉధృతంగా టీఎస్ఆర్టీసీ జేఏసీ సంతకాల సేకరణ కార్యక్రమం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రగతి రధ చక్రాల కిందపడి నలిగిపోతున్న బడుగుజీవులు ఆర్టీసీ కార్మికులు. నమ్ముకున్న సంస్థ తమ కష్టాన్ని పట్టించుకోకున్నా, ఒళ్లు దాచుకోకుండా కష్టపడే మనస్తత్వం వారి సొంతం. 55 రోజులు సమ్మె చేసి సహనాన్నే ఆయుధంగా సంధించిన చరిత్ర వారిది. హక్కులు, ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం పోరాటాన్నే ఊపిరిగా మార్చుకున్న ధీరులు వారు. తాత్కాలికంగా వారికి కష్టం వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ, అణచివేతను సహిస్తున్నారే తప్ప, సమరశీల పోరాటాన్ని వీడలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం తమ డిమాండ్లను, కష్టాలను పట్టించుకోవట్లేదనే ఆవేదనలోంచే వారి ఆందోళనలు రూపొందుతున్నాయి. టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేవు... అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి బలంగా ఢకొీట్టేందుకు సిద్ధపడుతున్నారు. మాకు సంఘాలే కావాలంటూ నినదిస్తున్నారు. మీ సంక్షేమ మండళ్లతో మాకు ఒరిగిందేంలేదంటూ సమస్యల చిట్టాలు విప్పుతున్నారు. టీఎస్ఆర్టీసీలోని తొమ్మిది కార్మిక సంఘాల నేతృత్వంలో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపుతో సంఘాలకు అతీతంగా కార్మికులు స్పందిస్తున్నారు. ''రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు లేవన్నారు. నిరీక్షించాం. ఆ గడువు ముగిసింది. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు జరపట్లేదు'' అంటూ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని, కార్మిక శాఖనూ ప్రశ్నిస్తున్నారు. జేఏసీ పిలుపులో భాగంగా ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరగుతున్నది. దానికి కార్మికుల నుంచి విశేష స్పందన వస్తున్నది. కొన్ని డిపోల్లో వందశాతం, మరికొన్ని డిపోల్లో 90 శాతం మేర కార్మికులు సంతకాల సేకరణలో భాగస్వాములు అయ్యారు. తమ పేరు, స్టాఫ్ నెంబర్, హౌదాలను పేర్కొంటూ నిర్భయంగా సంతకాలు చేస్తున్నారు. 2017, 2021 ఏప్రిల్ 1 నుంచి తమకు రావల్సిన రెండు వేతన సవరణలు ఎందుకు చేపట్టలేదో చెప్పండంటూ అక్షరాల అగ్నికణికలు మండిస్తూ సంతకాలు చేస్తున్నారు. సంపూర్ణ ఉద్యోగ భద్రత సర్క్యులర్ ఎక్కడంటూ నల్ల సిరాతో నిరసన సంతకాలు చేస్తున్నారు. 2019 నుంచి రావల్సిన ఆరు డిఏలు, 2013 వేతన సవరణలో 50 శాతం పాత బకాయిల బాండ్లకు డబ్బులు ఎప్పుడిస్తారనీ అడుగుతున్నారు. మా జీతాల్లో నుంచి దాచుకున్న కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సొమ్మును వాడుకోవడానికి మీకేం అధికారం ఉందంటూ యాజమాన్యంపై నల్లసిరా చల్లుతున్నారు. యూనియన్లు కావాలంటూ అక్షరాయుధాలను సంతకాల రూపంలో చెక్కుతున్నారు. తాము సంతకాలు పెట్టిచ్చిన కాగితాలను కార్మిక శాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యానికి ఇవ్వండంటూ జేఏసీని కోరుతూ కార్మిక ఐక్యతను చాటుతున్నారు.
ఇది కార్మికులే కోరుకున్న పోరు
వీఎస్ రావు, టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
మూడేండ్ల క్రితం ఏ డిమాండ్ల సాధన కోసమైతే 55 రోజులు సమ్మెచేశామో...అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటికి కొత్త డిమాండ్లు జోడయ్యాయే తప్ప, ఎలాంటి పరిష్కారాలు లభించలేదు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ మండళ్లు సాధించింది ఏమీ లేదు. కార్మికులపై పనిభారాలతో పాటు ఆర్థిక ఇబ్బందులూ పెరిగాయి. అత్యంత అనిశ్చితి, అవేదన, ఆందోళనల మధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వాటిలోంచే మరో స్వచ్ఛంద కార్మికోద్యమం పుట్టుకొస్తున్నది. దానికి ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక శాఖలే బాధ్యత వహించాలి.
ఎన్నికలు నిర్వహించాలి
కే రాజిరెడ్డి, టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మెన్
రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళ నంలో చెప్పారు. ఆ గడువు ముగిసింది. తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. యూనియన్లు లేవని ఆయన కేవలం మౌఖికంగా చెప్పారే తప్ప, దానికెలాంటి చట్టబద్ధత లేదు.
చట్టాలను తుంగతో తొక్కారు
కే హన్మంతు ముదిరాజ్, టీఎస్ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మెన్
చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. రాజ్యాంగం పట్ల కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నది. సింగరేణి కాలరీస్లో బొగ్గుగని కార్మిక సంఘం ఉంటుంది... దానికి సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉంటారు. మరి ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఎందుకు ఉండొద్దో సీఎం కేసీఆర్ చెప్పాలి.
వేతన సవరణ ఎందుకు చేయరు?
పి కమాల్రెడ్డి, టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
2015లో ఇచ్చిన 44 శాతం ఫిట్మెంట్ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగలేదు. అప్పటికీ ఇప్పటికీ డీజిల్, పెట్రోల్ రేట్లతో పాటు నిత్యవసర వస్తువుల ధరలూ పెరిగాయి. ఆరు డిఏలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సి ఉంది. ఇంకెంతకాలం ఓపికపట్టాలి. మా సహనానికీ హద్దుంటుంది.
రిటైర్డ్ కార్మికుల సెటిల్మెంట్లూ ఇవ్వట్లేదు
జీ అబ్రహం, టీఎస్ఆర్టీసీ జేఏసీ కో- కన్వీనర్
రిటైర్డ్ కార్మికుల సెటిల్మెంట్లు కూడా యాజమాన్యం ఇవ్వట్లేదు. 30-35 ఏండ్లు సంస్థ కోసం కష్టించి పనిచేసి, 60 ఏండ్ల వయసులో ఉద్యోగ విరమణ చేశాక, వారికి సంస్థ నుంచి రావల్సిన బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఏండ్లతరబడి తిప్పించుకోవడం ఎంతవరకు న్యాయం. ప్రభుత్వం ఆలోచన చేయాలి.
వేధింపులు బంద్ చేయాలే..
కే యాదయ్య, టీఎస్ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్
కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతున్నారు. కొత్త బస్సుల కొనుగోళ్లే లేవు. పాత బస్సులకు కిలోమీటర్ పర్ లీటర్ (కేఎమ్పీఎల్) తక్కువ వస్తుందని కార్మికులను వేధిస్తున్నారు. బస్సులు సక్కంగా లేకుంటే డ్రైవర్లేం చేస్తారు? ఆర్టీసీ ఉద్యోగం కత్తిమీది సాములా తయారైంది.
ప్రభుత్వంలో విలీనం చేయాలి
బీ సురేష్, టీఎస్ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లించాలి. సంస్థకు బడ్జెట్లో రెండుశాతం గ్రాంటు ఇవ్వాలి. చనిపోయిన, మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి.
డీజిల్పై పన్నులు మినహాయించాలి
పీ హరికిషన్, టీఎస్ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఎక్సైజ్ డ్యూటీ మినహాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్ని తగ్గించాలి. సంస్థ అప్పుల్ని ఈక్విటీగా మార్చాలి. డ్యూటీకి రిపోర్టు చేస్తే హాజరు ఇవ్వాలి. ఓవర్టైం భత్యం చెల్లించాలి. అక్రమ రవాణాను నిరోధించాలి.
మహిళా ఉద్యోగులపై వేధింపులు
బీ యాదగిరి, టీఎస్ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్
సంస్థలో మహిళా ఉద్యోగులు వివిధ రూపాల్లో వేధింపులకు గురువుతున్నారు. తక్షణం సంస్థలో మహిళా కమిటీలను పునరుద్ధ రించాలి. మహిళా కండక్టర్లకు రాత్రి 8లోపు డ్యూటీలే వేయాలి. డిపోల్లో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ మహిళా ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటికీ అమలు కాలేదు. విచారకరం.