Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాసుల వేటకు ప్రభుత్వం సన్నద్ధం
- మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు
- ఇప్పటికే నాటి అడ్వాన్స్లు వెనక్కు
- రాష్ట్ర వ్యాప్తంగా వేలం నిర్వహణ
- మార్చి ద్వితీయార్థంలో ఖమ్మం మినహా మిగిలిన చోట్ల యాక్షన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ కాసుల వేటలో సర్కారు స్థలాలను ఒక్కొక్కటిగా అమ్ముతూ రూ.లక్షల కోట్లు కూడబెట్టేందుకు యత్నిస్తోంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో నెలకొల్పిన రాజీవ్ స్వగృహ ఇండ్ల స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు విక్రయించేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీలో ఈ-వేలం నిర్వహిస్తారు. మిగిలిన చోట్ల భౌతికవేలం నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాధ్యతను పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)కు అప్పగించింది. ఈ సంస్థ అధికారులు జిల్లాల్లో వేలం నిర్వహణలో కలెక్టర్లకు సహకరిస్తారు.
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకుగాను ఖమ్మం మినహా మిగిలిన చోట్ల 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా వేలం నిర్వహించనున్నారు. ఖమ్మంలో నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో దీనిపై ఇంకా మార్గదర్శకాలు వెలువడలేదని టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ పవన్ స్పష్టం చేశారు. మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో 1,408 ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.800 కోట్ల వరకు రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వేలానికి వీలుగా ఉన్న ప్రాజెక్టుల లేఔట్లను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. ఈనెల 18న, వచ్చేనెల 7న ప్రిబిడ్ నిర్వహించనున్నారు. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఈ-వేలం నిర్వహించడంతో భారీ స్పందన వచ్చింది. సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వగృహ భూములనూ వేలం వేసి భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాట్లు చదరపు గజానికి కనీస ధర రూ.5వేల నుంచి రూ.40వేలుగా నిర్ధారించినట్టు టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ స్వగృహ పథకానికి శ్రీకారం చుట్టింది. మధ్యతరగతి వారికి మార్కెట్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. తెలంగాణలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ సహా 15 చోట్ల రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి మధ్యలో నిలిచిపోయాయి. చాలాచోట్ల ఓపెన్ ప్లాట్లతో పాటు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఇండ్ల స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం(జలజ)లో నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరిన నేపథ్యంలో వేలం తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఖమ్మంలో నిర్మాణాలు ఇలా...
ఖమ్మం జిల్లాకు మంజూరైన రాజీవ్ స్వగృహ ఇండ్ల సముదాయాన్ని (జలజ ప్రాజెక్టు) ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మాణం ప్రారంభించిన రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లపై నాటి ప్రభుత్వం సుమారు రూ.72 కోట్లు ఖర్చు చేసింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మధ్యలో నిర్మాణాలు ఆగిపోయాయి. మొత్తం 8 బ్లాక్లు, ఒక్కో బ్లాక్లో తొమ్మిది ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్కు 8 ఫ్లాట్ల చొప్పున మొత్తం 578 ఇండ్లు ఉన్నాయి. వాటిలో రెండు పడక గదుల ఇండ్లు 288 కాగా.. ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,135 చదరపు అడుగులు. మూడు పడక గదుల ఇండ్లు 288 ఉన్నాయి. ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,435 చదరపు అడుగులు. ఇండ్ల నిర్మాణం మొత్తం 7,00,600 చదరపు అడగులుగా ఉంది. రెండో ఫేజ్ నిర్మాణం కోసం కేటాయించిన మరో ఏడు ఎకరాలు ఖాళీగానే ఉంది. ఎకరం రూ.3 కోట్లు ఉంటుంది. మొత్తం 16 ఎకరాల స్థలమే దాదాపు రూ.50 కోట్ల విలువ చేస్తుందని అంచనా. 2018లో ఉద్యోగసంఘాల నేతలు స్వగృహ సముదాయాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం అంగీకరించకపోవడం గమనార్హం. ఇప్పుడీ అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను చదరపు అడుగు రూ.2,500 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరవచ్చని అధికారుల అంచనా.
వేలం దిశగా సన్నాహాలు..
వేలం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా రాజీవ్ స్వగృహ మిషన్ నుంచి బాధ్యతలను టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ స్వగృహ సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ అధికారులు సముదాయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. రెవెన్యూ అధికారులు ఖాళీ స్థల సర్వే నిర్వహించి మార్కింగ్ చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు పక్కనే ఉన్న మున్నేరు బఫర్జోన్ గుర్తించి మార్కింగ్ పూర్తి చేశారు. ఇండ్ల నిర్మాణం సందర్భంగా డబుల్ బెడ్రూంకు రూ.3,000, ట్రిబుల్ బెడ్రూంకు రూ.5,000 చొప్పున చెల్లించిన వారి అడ్వాన్స్లను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇండ్లు కేటాయించే పరిస్థితి లేదని భావించి మొదట్లోనే చాలా మంది అడ్వాన్స్లు వెనక్కు తీసుకున్నారు. మిగిలిన 70 మందికి పైగా ఉన్న అడ్వాన్స్లను తిరిగి ఇచ్చేస్తున్నారు.
మధ్య తరగతి ప్రజలకు అన్యాయం
మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్వగృహ ఇండ్లను వారికే ఇవ్వడం సముచితం. అలా కాకుండా ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సామాన్యులకు అన్యాయం చేయడమే. నాడు అడ్వాన్స్లు చెల్లించిన వారందరికీ తక్కువ ధరకు ఫ్లాట్లు కేటాయించాలి. లాభాపేక్షతో ప్రభుత్వం వేలం వేసి పోటీ పెట్టడం మూలంగా సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. ధర భారమై పేద, మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ప్రజల ఆస్తులను అమ్మే చర్యలను విరమించుకోవాలి.
- నున్నా నాగేశ్వరరావు- సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి