Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు
- పరిశీలించిన తహసీల్దార్ ఎంపీడీఓ
- మధ్యాహ్న భోజన నిర్వాహకుల తొలగింపునకు ఆదేశం
నవతెలంగాణ-శాయంపేట
'రుచి, పచి లేని మధ్యాహ్న భోజనాన్ని తినలేకపోతున్నాం.. ఈ భోజనం మాకొద్దు' అంటూ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడపాక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే... పెద్దకొడపాక ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో 194 మంది హై స్కూల్ విద్యార్థులు, 92 మంది పీఎస్ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కడవెండి పద్మ, అన్న వసంత.. 12 ఏండ్ల నుంచి మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. కాగా, భోజనం సరిగా వండటం లేదనీ, విద్యార్థులు తినలేక పోతున్నారని వారి తల్లిదండ్రులు గతంలో సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయం గతంలో పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీఈఓ దృష్టికి ఎస్ఎంసీ చైర్మెన్, సర్పంచ్ తీసుకెళ్లారు. మండల సభలో మధ్యాహ్న భోజన నిర్వాహకులను మార్చాలని సర్పంచ్ చర్చ లేవనెత్తారు. అయినప్పటికీ నిర్వాహకులను మార్చలేదు. కాగా, సోమవారం మధ్యాహ్న భోజనాన్ని వడ్డించిన ప్లేట్లతో నిరసన తెలపడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, శశికళ సర్పంచ్కు విషయాన్ని చేరవేశారు. స్పందించిన సర్పంచ్ ప్రకాష్ రెడ్డి ఎంపీడీఓ ఆమంచ కృష్ణమూర్తి, తహసీల్దార్ హరికృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వారు పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం బాగా లేదని స్పష్టం చేశారు. ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల అభిప్రాయ సేకరణ చేపట్టి మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగిస్తున్నట్టు తీర్మానం చేశారు. నాణ్యతతో భోజనం అందించే నిర్వాహకులను ఏర్పాటు చేసుకోవాలనీ, వారం రోజుల పాటు భోజనం నిర్వహణ సరిగా ఉంటే నిర్వాహకులుగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను మార్చడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ ప్రకాష్ రెడ్డి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.