Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మంత్రి హరీశ్రావు లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శనివారం మరోసారి లేఖ రాశారు. ఈ ఏడాది జనవరి 24న ఇవే అంశాలపై తాను లేఖ రాసాననీ, దానిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని తాజా లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉన్నదని తెలిపారు. వాటితో పాటు గ్రాంట్ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. నీతిఆయోగ్ సూచించినట్టు రాష్ట్రానికి రూ.24,205 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించిందనీ, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతున్నదనీ, ఆ మేరకు రాష్ట్రానికి రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని గుర్తుచేశారు. ఆ నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో... రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారనీ, దీనివల్ల తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయని మరోసారి గుర్తుచేశారు. ఈ విషయాన్ని తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా సర్దుబాటు చేయలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాలని కోరారు.