Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 174 ఏండ్లయినా ఇప్పటికీ అది చారిత్రక పత్రం
- పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం కులం పోదు
- నిత్య కార్యాచరణతో అధ్యయనం కొనసాగించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- హైదరాబాద్లో రెడ్బుక్ డే సామూహిక పఠన కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచాన్ని మార్చడమే 'కమ్యూనిస్టు ప్రణాళిక' లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఆ ప్రణాళికను వివిధ దేశాల్లోని నిర్దిష్టమైన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ కార్యక్రమం రూపొందించుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 21 'రెడ్ బుక్స్ డే'లో భాగంగా సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సామూహిక పఠనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళికను 1848, ఫిబ్రవరి 21న మార్క్స్, ఏంగెల్స్ సంయుక్తంగా ప్రచురించారని గుర్తు చేశారు. అందులోని ముఖ్యాంశాలను ప్రపంచమంతా చదివి విశ్లేషిస్తున్నదని వివరించారు. పెట్టుబడిదారీ విధానం అంతర్గత వైరుధ్యాలు, అనివార్యంగా ఈ వ్యవస్థ మారిపోయి సోషలిస్టు వ్యవస్థలోకి చేరుకునే పరిణామ క్రమాన్ని కమ్యూనిస్టు ప్రణాళిక స్పష్టంగా వివరించిందని చెప్పారు. 174 ఏండ్ల కింద ఆ పుస్తకాన్ని రాసినా ఇప్పటికీ అది చారిత్రక పత్రమని అన్నారు. నేటి సమకాలీన పరిస్థితులు అందులో కండ్లకు కట్టినట్టు ఉన్నాయని వివరించారు. బ్రహ్మంగారి కాలజ్ఞనం ఎలా ఉందో తెలియదు గానీ, మార్క్స్ కాలజ్ఞానం స్పష్టంగా 174 ఏండ్ల క్రిందే పెట్టుబడిదారీ విధానం ఎలా ఉంటుందో చెప్పారని గుర్తు చేశారు. వృత్తులు ఎలా నాశనమవుతాయి, పట్టణాల ఆధిపత్యం ఎలా వస్తుంది, గ్రామీణ ప్రాంతాలు ఎలా నిర్వీర్యమవుతాయన్న అంశాలను ఆనాడే వివరించారని అన్నారు. కులం, మతం పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి ఆటంకమని చెప్పారు. అయినా కులాన్ని అది నిర్మూలించడం లేదన్నారు. భారత్లో బూర్జువాలు, భూస్వాములు కలిసిపోయారని వివరించారు. అందుకే పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం కులం పోదన్నారు. అసమానతలు పోయి అందరూ సమానంగా ఉండే సమాజం కావాలని మార్క్స్, ఏంగెల్స్ కోరుకున్నారని అన్నారు. దోపిడీ, అణచివేతకు గురవుతున్న పీడితులను శాశ్వతంగా విముక్తి చేసే శక్తి కార్మికవర్గానికే ఉందన్నారు. కార్మికుడు, యజమాని అనేది పోయినప్పుడే అది సాధ్యమని చెప్పారు. మానవులంతా ఒక్కటేననీ, కమ్యూనిస్టులు విశ్వమానవ ప్రేమికులని అన్నారు. వారు అధికారంలోకి వస్తే పెట్టుబడిదారుల ఆస్తిని మాత్రమే రద్దు చేయడం జరుగుతుందనీ, ప్రజలు కష్టపడి సంపాదించిన సొంత ఆస్తిని రద్దు చేయబోమని స్పష్టం చేశారు. కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఎలా మారతాయి, ప్రతిదీ డబ్బుమయం ఎలా అవుతుంది, మార్కెట్లో పోటీ, టెక్నాలజీ వల్ల కార్మికుల జీవితాలు ఎలా ఛిద్రమవుతాయన్నది అనే అంశాలను అప్పట్లోనే కమ్యూనిస్టు ప్రణాళికలో రాశారని చెప్పారు. అనివార్యంగా కార్మికవర్గ పోరాటాలు ఎలా ముందుకొస్తాయో స్పష్టంగా ప్రకటించారని అన్నారు. మార్క్సిజం పట్ల ఇటీవల వస్తున్న విమర్శలు, రాజకీయ దాడులు తట్టుకుని నిలబడాలంటే నిత్య కార్యచరణతో అధ్యయనం కొనసాగించాలని సూచించారు. రాబోయే కాలం తమదనీ, గెలుచుకోవడానికి ఓ ప్రపంచం ఉందని చెప్పారు. 'పోరాడితే పోయేదేం లేదు... బానిస సంకెళ్లు తప్ప'అని నినాదం ఇచ్చిన గొప్ప పుస్తకం కమ్యూనిస్టు ప్రణాళిక అని వివరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ ఉత్పత్తికి మార్కెట్ అవసరం ఉంటుందనీ, ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పారు. అదే ఇప్పుడు ప్రపంచీకరణ పేరుతో అమలవుతున్నదని వివరించారు. పెట్టుబడిదారుల తరహాలోనే కార్మికులకూ జాతీయత ఉండబోదన్నారు. మేధోపరమైన ఉత్పత్తి పెరుగుతుందనీ, ప్రస్తుతం టెక్నాలజీ పెరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పట్టణాల అవసరాలను తీర్చడం కోసమే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ఆనాడే కమ్యూనిస్టు ప్రణాళికలో పొందుపరిచారని వివరించారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ రెడ్బుక్స్డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖలూ, మండల, జిల్లా కేంద్రాల్లోనూ సామూహిక పఠన కార్యక్రమం జరుగుతున్నదనీ, అందులో భాగంగానే హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్, పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు. ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు.