Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
- ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలి
- ఘనంగా ఎన్పీఆర్డీ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి ఐదు శాతం నిధులు కేటాయించాలనీ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఏం.అడివయ్య డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ ఏర్పడి 12 ఏండ్లయిన సందర్భంగా చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఆత్మగౌరం, హక్కుల సాధన లక్ష్యాలతో కోల్ కత్తా పట్టణంలో సంఘం ఏర్పడిందని తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామనీ, గ్రామ గ్రామాన సంఘం జెండా ఆవిష్కరణలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా వికలాంగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న వికలాంగుల సంఘాలను ఐక్యం చేసి ముందుకు సాగుతుందన్నారు.
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని సాధించామన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వికలాంగులందరికీ ఒకే గుర్తింపు కార్డు కావాలని పోరాడి యుడిఐడి కార్డులను ఇప్పించామని తెలిపారు. రైల్వేలో సౌకర్యాలు కల్పించాలని ఉద్యమాలు కొనసాగిస్తున్నామన్నారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టడం కోసం ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడేండ్ల నుంచి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు.
ఇరవై ఒక్క రకాల వైకల్యాలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల వైకల్యాల వారికే ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తున్నదని విమర్శించారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని 2016 వికలాంగుల చట్టంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనీ, పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై జరుగుతున్న అవమానాలు అన్యాయాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎన్ పీఆర్ డీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికళ, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు యూసుఫ్, సత్యనారాయణ, అనంతమ్మ, శంకర్, లక్ష్మి ,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.