Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 8 నుంచి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2022 జులై మూడో తేదీన జరగనుంది. ఈ రాతపరీక్షను ఆన్లైన్లో ఐఐటీ ముంబయి నిర్వహిస్తున్నది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు అదేనెల 14వ తేదీ వరకు ఉంటుంది. ఫీజు చెల్లింపునకు జూన్ 15వ తేదీ వరకు అవకాశమున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షలు జులై మూడో తేదీన ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 జరుగుతాయి. ఈ ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. అదే తేదీ నుంచి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జులై 21న ఏఏటీ రాతపరీక్ష జరుగుతుంది. అదేనెల 24న ఏఏటీ ఫలితాలు విడుదలవుతాయి. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఏప్రిల్, మేలో జేఈఈ మెయిన్?
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, త్రిపుల్ఐటీల్లో ప్రవేశాలతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రాతపరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఏప్రిల్, మేలో నిర్వహించే అవకాశమున్నది. నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తారు.