Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఈఆర్సీ బహిరంగ విచారణలో ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాల డిమాండ్
- ప్రభుత్వమే అతిపెద్ద డిఫాల్టర్-పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి
- ఫిక్సెడ్ చార్జీల భారం ప్రజలపై ఎందుకు?: ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- ఏఆర్ఆర్లు ఎలా ఆమోదిస్తారు : సీనియర్ జర్నలిస్ట్ ఎమ్ వేణుగోపాలరావు
- డిస్కంల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోతున్నాయి : పశ్యపద్మ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ చార్జీల పెంపును కోరుతూ డిస్కంలు ఇచ్చిన ఆదాయ అవసరాల ప్రతిపాదన (ఏఆర్ఆర్)లను నిర్ధ్వంధంగా తిరస్కరించాలని రాజకీయపార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, పారిశ్రామిక వేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, విద్యుత్రంగ నిపుణులు, సామాన్య ప్రజలు డిమాండ్ చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసిన ప్రతిపాదనల్లో ఎలాంటి హేతుబద్ధత లేదనీ, అసలు వాటిని పరిగణనలోకే తీసుకోవద్దని స్పష్టంచేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి ఫ్యాప్సీ భవన్లో డిస్కంలు ఇచ్చిన ఏఆర్ఆర్లపై బహిరంగ విచారణ జరిగింది. టీఎస్ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు అధ్యక్షత వహించగా, కమిషన్ సభ్యులు ఎమ్డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్య పాల్గొన్నారు. డిస్కంల ప్రతిపాదనలపై 185 మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వీరిలో ఎవరూ చార్జీల పెంపును సమర్థించలేదు. బహిరంగ విచారణ ప్రారంభంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డి డిస్కంల ఆదాయ, అవసరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ కన్వీనర్ ఎమ్ తిమ్మారెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ సీనియన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, స్వామి జగన్మయానంద, ఫెర్రో అలాయిస్ ప్రాసెసర్స్ అసోసియేషన్, దక్షిణ మధ్యరైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజినీర్ జీవీ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వమే అతిపెద్ద డిఫాల్టర్-రేవంత్రెడ్డి
డిస్కంల నష్టాలు, అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పీసీసీ అధ్యక్షులు ఏ రేవంత్రెడ్డి బహిరంగ విచారణలో తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటున్నదనీ, కరెంటు బిల్లులు మాత్రం చెల్లించకుండా అతిపెద్ద డిఫాల్టర్ అయ్యిందని విమర్శించారు. సామాన్య ప్రజలు ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్చేసే డిస్కంలు, ప్రభుత్వం పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను నియంత్రిస్తూ, సుమోటోగా నిర్ణయాలు తీసుకోవాల్సిన టీఎస్ఈఆర్సీ తన బాధ్యతల్ని విస్మరిస్తున్నదని విమర్శించారు. 2015-2016 సంవత్సరంలో డిస్కంలకు దాదాపు రూ.11 వేల కోట్ల అప్పు ఉన్నదనీ, ఉదరు స్కీమ్ ద్వారా కేంద్రప్రభుత్వం దాదాపు రూ.8,900 కోట్లను మాఫీ చేసిందని చెప్పారు. అప్పటికి డిస్కంల అప్పు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడవి రూ. 60వేల కోట్లకు ఎలా చేరాయని ప్రశ్నించారు. డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలు చేసుకోవడంలో విఫలమై పూర్తిగా దివాలా తీసాయని అన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే, సామాన్య ప్రజలపై కరెంటు చార్జీలు పెంచి భారాలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో విద్యుత్రంగాన్ని భ్రష్టుపట్టించారనీ, దీనిపై ఈఆర్సీ సుమోటోగా విచారణ జరిపి, ప్రభుత్వంపై, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, శ్రీశైలం విద్యుత్ ప్రమాదం, ప్రభుత్వ సబ్సిడీలు, డిస్కంల నిర్వహణ నష్టాలన్నింటినీ వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్లో కలిపేయడం వంటి అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో మొత్తం 41 డిస్కంలు ఉంటే, వాటిలో టీఎస్ఎస్పీడీసీఎల్ 23వ స్థానంలో, టీఎస్ఎన్పీడీసీఎల్ 33వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రకటించిందనీ, ఇంతకంటే సిగ్గుచేటు ఏముందని అన్నారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ 4వేల మెగావాట్లకు పైగా ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నదనీ, కానీ టీఎస్జెన్కో ఆధ్వర్యంలో కేవలం ఒక్క మెగావాట్ మాత్రమే ఉన్నదని ఎద్దేవా చేశారు. టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి ప్లాంట్ల సామర్ధ్యం కేవలం 6,485 మెగావాట్లు మాత్రమేనని చెప్పారు. జెన్కో సంస్థల్ని ఉద్దేశ్యపూర్వకంగా బ్యాకింగ్ డౌన్ చేస్తూ ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తూ, అధిక ధరలకు కరెంటును కొంటున్నారని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. విద్యుత్ చౌర్యంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే ఆర్థికమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట రెండో స్థానంలో, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మూడవ స్థానంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు సంస్థల నివేదికలు బయటకు రాలేదనీ, ఈ దుర్ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.తప్పులన్నీ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు చేస్తూ, ప్రజలపై భారాలు వేస్తామంటే సహించబోమన్నారు.
ఫిక్సెడ్ చార్జీలు భారమే-సారంపల్లి మల్లారెడ్డి
డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల్లో వినియోగదారులపై రూ.6,830.90 కోట్ల భారాలు వేసి, మరో రూ.4,097.28 కోట్ల లోటును చూపారనీ, ప్రభుత్వం రూ.5,651.65 కోట్లు సబ్సిడీ ఇచ్చినా, ఆ లోటును ఎలా భర్తీ చేసుకుంటారో స్పష్టంగా చెప్పలేదని ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తన పిటీషన్లో పేర్కొన్నారు. డిస్కంలు సకాలంలో ఏఆర్ఆర్లు సమర్పించకుండా ప్రజలను భ్రమల్లో ఉంచుతూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పేదల ఇండ్ల కనెక్షన్లపై (ఎల్టీ కేటగిరి)పై సామూహికంగా యూనిట్కు 50 పైసలు చొప్పున పెంచుతూ ప్రతిపాదన చేశారనీ, కష్టమర్ సర్వీస్ చార్జీలను 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించడాన్ని ఆయన తప్పుపట్టారు. మిగులు విద్యుత్ డ్రామా అని కొట్టిపారేశారు. మిగులు ఉంటే కొత్త ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారని పిటీషన్లో ప్రశ్నించారు. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ (డీఎస్ఎమ్) ప్రమాణాల అమల్లో విద్యుత్ సంస్థలు విఫలమయ్యాయనీ, వారి నిర్లక్ష్యం వల్ల రైతులు, పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఆర్ఆర్లు ఎలా ఆమోదిస్తారు?-ఎమ్ వేణుగోపాలరావు
విద్యుత్ పంపిణీ సంస్థలు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ, మూడేండ్లుగా ఏఆర్ఆర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు ఈఆర్సీ వాటిని ఎలా ఆమోదిస్తుందని సీనియర్ జర్నలిస్ట్, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎమ్ వేణుగోపాలరావు ప్రశ్నించారు. 2019-20 నుంచి మూడేండ్ల ఏఆర్ఆర్లు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించిన ఈఆర్సీ ఆకాలం నష్టాలు, అప్పులను ప్రస్తుత ఏఆర్ఆర్లో కలిపేస్తే, ఇక తిరస్కరించి ఏం ప్రయోజనం అని అడిగారు. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. దాన్ని వినియోగదారులపై ఎలా మోపుతారని ప్రశ్నించారు.
డిస్కంల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోతున్నాయి
-తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ
డిస్కంల నిర్లక్ష్యం వల్లే ప్రజలు, రైతులు, ఆర్టిజన్ కార్మికులు, పశువులు అర్థంతరంగా విద్యుత్ షాక్లకు గురై మరణిస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యుత్ సంస్థల్లో అవినీతిని రూపుమాపాలి. డిస్కంల అప్పులు, నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలిప్రజలపై భారాలు వేయోద్దు.
విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పదు టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఖర్చులు పెరిగడంతో అనివార్యంగా ఐదేండ్ల తర్వాత 2022-23లో రూ.6,831 కోట్ల పెంపు ప్రతిపాదన చేస్తున్నాం. గతంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 6,666 మెగావాట్లు ఉంటే, ఇప్పుడది13,688 మెగావాట్లకు పెరిగింది. ఎత్తిపోతల సాగునీటి పారుదల ప్రాజెక్టులతో డిమాండ్ భారీగా పెరిగింది. బొగ్గు, రవాణా ఇతర ఖర్చులు భారీగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించే తెలంగాణలో టారిఫ్ పెంపు ప్రతిపాదనలు రూపొందించాం. 50 యూనిట్లలోపు వినియోగదారులకు 20 ఏండ్లుగా అదే టారిఫ్ కొనసాగుతున్నది. దాన్ని పెంచాలని ప్రతిపాదించాం. టీఎస్పీడీసీఎల్ కు రూ.2,686.79 కోట్లు రెవెన్యూలోటు ఉంది. దాన్ని భర్తీ చేసుకోవాలి.