Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడా బూర్జువా పార్టీలపై వ్యతిరేక వైఖరితో ఉండాలి
- అవకాశవాద విధానాలతో ప్రాంతీయ పార్టీలు
- రాష్ట్రవ్యాప్తంగా 9 నియోజకవర్గాలపై కేంద్రీకరణ
- అమెరికా సామ్రాజ్యవాద ఫలితమే యుద్ధాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర వర్క్షాప్లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బడా బూర్జువా పార్టీలపై వ్యతిరేక వైఖరితో ఉండాలని సీపీఐ(ఎం) శ్రేణులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ సైతం దీనికి ఏమాత్రం తీసిపోదన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అవకాశవాద విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 9 నియోజకవర్గాలపై పార్టీ కేంద్రీకరణ చేసినట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి మీటింగ్ హాల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ మంగళవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 23వ అఖిల భారత మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానంపై తమ్మినేని క్లుప్తంగా వివరించారు. అమెరికా సామ్రాజ్యవాద ఫలితంగానే యుద్ధాలు సంభవిస్తున్నాయన్నారు. నాటోను అడ్డుపెట్టుకుని రష్యాపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఉక్రెయిన్- రష్యా యుద్ధమని వివరించారు. ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేర్చాలని అమెరికా ప్రయత్నిస్తోందనీ, దాన్ని రష్యా ధిక్కరిస్తోందని తెలిపారు. కమ్యూనిస్టు చైనా అభివృద్ధి చెందుతుండటం అమెరికాకు కంటగింపుగా మారిందన్నారు. మతోన్మాద బీజేపీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని సైతం మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటుకు కట్టబెడుతోందని తెలిపారు. సామాజిక న్యాయం అనే అంశాన్ని ఎప్పుడో తుంగలో తొక్కేసిందన్నారు. మహిళలను అస్సలు మనుషులుగా చూడటం లేదని తెలిపారు. ఫలితంగానే హిజాబ్ ధరించొద్దని ఆంక్షలు విధించిందని చెప్పారు. రాజ్యాంగానికి ఉన్న ఫెడరల్ లక్షణాన్ని సైతం దెబ్బతీస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని వ్యవసాయం, విద్యా వంటి కీలక అంశాలను సైతం లాక్కుందన్నారు. జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలు పన్నులు వేసుకునే హక్కులు కూడా లేకుండా చేసిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, చివరకు సుప్రీంకోర్టును సైతం తన చెప్పుచేతల్లోకి తీసుకుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీని అడ్డుకునేలా పార్టీ రాజకీయ విధానం ఉందన్నారు. బీజేపీతో పాటు మరో బడా బూర్జువా పార్టీ కాంగ్రెస్ విషయంలోనూ వ్యతిరేక వైఖరి అవలంబించాలన్నారు. ప్రాంతీయ పక్షాలు అవకాశవాద పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు ఏ ప్రాంతీయ పార్టీ నేతయినా సరే అవకాశవాద వైఖరితోనే వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న బూర్జువా-భూస్వామ్య పార్టీతో సంబంధాలు ఉండకూడదనే విధానాన్ని ముసాయిదాలో ప్రతిపాదించారని తెలిపారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే మాట్లాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని 2021 ఆగస్టులో నిర్ణయించామన్నారు. ఈ మేరకు కార్యాచరణ ఎలా ఉందో ఈ వర్క్షాప్లో చర్చించాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, జాన్వెస్లీ, రాష్ట్ర నాయకులు మిడియం బాబూరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, యాదాద్రి, నల్లగొండ, ములుగు జిల్లాల కార్యదర్శులు జహంగీర్, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, తుమ్మల వెంకటరెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.