Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన భార్యాభర్తలు (స్పౌజ్), ఇతర ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సాధారణ అప్పీళ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేర్వేరు జిల్లాలకు కేటాయించడం వల్ల ఉపాధ్యాయుల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారుల తప్పిదాల వల్ల ఉపాధ్యాయులు కోరుకున్న జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు కేటాయించబడి ఇబ్బందులకు గురౌతున్నారని పేర్కొన్నారు. వారు చేసుకున్న అప్పీళ్లను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈనెల ఒకటి నుంచి 15 వరకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినందువల్ల ఇప్పటికే అప్పీల్ చేసుకున్న వారి పరస్పర బదిలీల ప్రక్రియ కంటే ముందే పరిష్కారం దొరుకుతుందో లేదోననే తర్జనభర్జనలో ఉన్నారని తెలిపారు.