Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండ్లగూడ, బహదూర్పల్లి, ఖమ్మం పరిధిలో సక్సెస్
- రాజీవ్ స్వగృహ భూములు,
టవర్స్ కొనుగోలు కోసం ఎదురుచూపులు
- అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు
- ఈనెల 14 నుంచి ఆన్లైన్ వేలం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన 'ప్రీబిడ్ మీటింగ్స్' విజయవంతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్ను ఆన్లైన్ వేలం(ఈ-ఆక్షన్) పద్ధతిలో విక్రయాలకు పెట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 14వ తేది నుంచి ఆన్లైన్ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.బండ్లగూడ (నాగోల్-హైదరాబాద్) రాజీవ్స్వగృహ టవర్స్ (అపార్ట్మెంట్స్) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్ సమావేశం జరిగింది. అదేవిధంగా మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బహదూర్పల్లి (దుండిగల్ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మధ్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్ మీటింగ్ను హెచ్ఎండీఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్ సమావేశాలకు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి, రాజీవ్స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎస్.ఈశ్వరయ్య, హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్, సీజీఎం మాజీద్షరీఫ్తో పాటు ఆన్లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. నాగోల్ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్(అపార్ట్మెంట్స్)తో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్స్వగృహ కార్పొరేషన్ నిర్మించిందని, వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించినట్టు తెలిపారు. మిగతా వాటిల్లో చాలా వరకు రెడీ టు ఆక్యుపై(నివాసానికి సిద్ధంగా) ఉన్నాయని చెప్పారు. 2008లో ముంబాయికి చెందిన ఆర్కిటెక్చర్ కంపెనీతో డిజైన్ చేయించి నిర్మించిన ఇక్కడి అపార్ట్మెంట్లలో జీహెచ్ఎంసీ పరిధిలో అన్నిరకాల మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఖమ్మంలో..
ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్స్వగృహకు సంబంధించిన ఎనిమిది(8) టవర్స్ (అపార్ట్మెంట్స్) ప్రీబిడ్ సమావేశం శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, హెచ్ఎండీఏ సూపరింటెండెంట్ ఇంజినీర్ యూసుఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కమిషనర్ వేలం ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించారు. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న బాధ్యతల గురించిన యూసుఫ్ హుస్సేన్ వివరించారు.