Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022-23 బడ్జెట్ రూ 2,56,958 కోట్లతో ప్రతిపాదన
- రెవెన్యూ వ్యయం రూ 1,89,274.82 కోట్లు
- క్యాపిటల్ వ్యయం రూ 29,728.44 కోట్లు
- సంక్షోభం నుంచి సంక్షేమానికి పరుగులు
- ప్రతిఘాతక శక్తుల అవరోధాలను పట్టించుకోం
- జాతి నిర్మాణం కోసం పునరంకితమవుతామని వ్యాఖ్య
- ఉపాధి చట్టంలో కోతపై కేంద్రం ఆలోచించాలి
- 75వేల రైతురుణమాఫీ చేస్తాం
- సొంత జాగ ఉంటే మూడు లక్షలు
- కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ : బడ్జెట్ను వ్రవేశ పెట్టిన మంత్రి హరీశ్రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర విభజన సమయంలో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడిగా రూ 50వేల కోట్లు అందించామనీ, రైతు మరణిస్తే ప్రీమియం భారం లేకుండా ఐదు లక్షల బీమా ఇస్తున్నామన్నారు. సోమవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. అసెంబ్లీలో ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 2022-23 రాష్ట్రబడ్జెట్ రూ 2022-23 బడ్జెట్ను రూ 2,56,958 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ 1,89,274.82 కోట్లగా ఆయన అంచనా వేశారు. క్యాపిటల్ వ్యయాన్ని రూ 29,728.44 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో ఆసరా పింఛన్ కోసం నలబై ఆరు వేల ఆరు వందల యాభై కోట్లు అందించాయని తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితరుల కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.
బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్ కాదనీ, బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్ అని హరీశ్ చెప్పారు. 2013-14లో రాష్ట్ర జీఎస్డీపీ రూ 4,51,580 కోట్ల ఉంటే, అది 2021-22 నాటికి రూ 11,54,860 కోటకు చేరిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ముఖంపై సంతోషం అనే నినాదాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందన్నారు. గ్రామాల్లో డంపింగ్యార్డులు, వైకుంఠ ధామాలు, శ్మశానవాటికలు నిర్మించి గ్రామాల్లో అభివృద్ధి చేసిందన్నారు.కరోనా విపత్తు నేపథ్యంలో జాతీయ వద్ధి రేటు మైనస్ 1.4 శాతం నమోదైందనీ, తెలంగాణ మాత్రం అదేసమయంలో 2.2 శాతం వద్ధి రేటు సాధించిందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజు రోజుకూ పెరుగుతున్నదని చెప్పారు. సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం 'తెలంగాణ దళిత బంధు' అని చెప్పారు. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు విద్యను, ఉపాధిని పొందగలిగారు కానీ వివక్ష మాత్రం అంతం కాలేదన్నారు. దళిత బంధు పథకం కేవలం వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నదని వివరించారు. ఆ కుటుంబాల పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకూడదనే ఉద్దేశంతో దళిత రక్షణ నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్ షాపుల్లో 261 వైన్ షాపులు దళితులకు కేటాయించిందనీ, లైసెన్సులు పొందిన దళిత కుటుంబాలు ఇది తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబురపడ్డారని తెలిపారు. దళిత బంధు కింద వచ్చే సంవత్సరం నాటికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2022-2023 వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి చట్టం నిధుల్లో రూ 25 వేల కోట్ల కేంద్రం కోత పెట్టి, గ్రామీణ ఉపాధి అవకాశాలు దెబ్బతీసిందని విమర్శించారు. కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని పున్ణసమీక్షించాలని కోరారు. స్థల విస్తీర్ణం 75 చదరపు గజాల వరకు ఉంటే, ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదనీ, 500 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న వారు స్వీయ ధృవీకరణతో సింగిల్ విండో ద్వారా ఆన్ లైన్ లో అనుమతులు పొందవచ్చని తెలిపారు.
మన ఊరు...మన బడి
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మన ఊరు...మనబడి పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను (డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటిసరఫరా, ఫర్నీచర్, పాఠశాలలకు మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు,ప్రహారీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్డుల నిర్మాణం, అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం, నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం) అనేక రకాల సదుపాయాలను పెద్ద ఎత్తున చేపడుతున్నదని చెప్పారు. ప్రపంచాన్నే మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య...అది కేవలం మార్కుల కోసం కాదు. సమూల మార్పుల కోసమనే విషయాన్ని తమ ప్రభుత్వం విశ్వసిస్తున్నదని చెప్పారు. అందు కోసం గురుకుల విద్యకు పెద్దపీట వేసిందన్నారు. ఇక్కడి విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ప్రఖ్యాత యూనివర్సీటీల్లో సీట్లు పొందారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో తగిన వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. అందులో పీజీ కోర్సులను ప్రవేశ పెట్టినట్టు హరీశ్ తెలిపారు.
నాణ్యమైన వైద్యం కోసం...
పేదల ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం...గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయన్నట్టు మంత్రి తెలిపారు. ప్రతి ఆస్పత్రుల్లో వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. వరంగల్లో హెల్త్ సిటీని నిర్మించనున్నట్టు తెలిపారు. రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతోపాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలూ ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ , నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో కొత్తగా మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ, ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 'తెలంగాణ డయాగస్టిక్ కేంద్రాలు' ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల పరిమితి గతంలో 2 లక్షలు మాత్రమే ఉండేదనీ, దాన్ని రూ 5 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ప్రత్యేకంగా హార్ట్, లివర్, బోన్మారో వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఇస్తుందన్నారు. నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో జ్వర సర్వేను బెస్ట్ ప్రాక్టీసుగా ప్రకటించిందన్నారు.
75వేల లోపు రుణాలు మాఫీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ 16,144 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని హరీశ్రావు చెప్పారు. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ 75 వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ సాగు చాలా సులభతరమన్నారు. 'చీడపీడల బాధ ఉండదు. కోతులు, అడవి పందుల బెడద ఉండదు' అన్నారు. రైతులకు మంచి ఆదాయం వస్తున్నదని చెప్పారు. ఇటీవలి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీపై రూ 35వేల కోట్లు కోత విధించిందన్నారు. దీనివల్ల కొన్ని రకాల ఎరువుల ధరలు అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ 5,350 కోట్లు వెచ్చించి చెరువులను, చెక్ డ్యాంలను ప్రభుత్వం పునరుద్దరించిందన్నారు. వీటికింద 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందని చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రూ 35వేల 200కోట్లతో చేపట్టిందన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల, పంపుహౌజుల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో కరవు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండలతోపాటు అచ్చంపేట, కల్వకుర్తిల్లోని అయిదు మండలాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఆర్.విద్యాసాగర్ రావు- డిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. వార్ధా బ్యారేజీ, కుష్టి, చెన్నూరు ఎత్తిపోతల పథకాలు, నల్లగొండ ఎత్తిపోతల పథకాలు, గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకం, వికారాబాద్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. మిషన్ భగీరథపై కేంద్రం ప్రశంస జల్లులు కురిపించేదేకానీ పైసా ఇవ్వలేదన్నారు.
ఆసరా పింఛన్లకు భరోసా
వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, బోదకాల బాధితులకు రూ 2,016 రూపాయలు, వికలాంగులకు రూ 3,016కు ఇస్తున్నట్టు తెలిపారు. ఏడున్నర సంవత్సరాలలో ఇందుకోసం ప్రభుత్వం రూ 46, 650 కోట్ల ఖర్చు చేసిందన్నారు. వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందస్తున్నదని చెప్పారు. సొంత జాగ ఉన్న వారు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారనీ, సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తామని తెలిపారు. చిన్నారుల మీద లైంగిక అకత్యాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫోక్సో కోర్టులను ఏర్పాటు చేసిందని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీని వర్తింజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
లక్షమంది భవననిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటర్ సైకిళ్లను అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్కు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుందనీ, ఉత్తర భాగంలో భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వం, సుపరిపాలన మేలైన శాంతిభద్రతలు నెలకొనడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. అమాయకులైన యువకులు మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు.కొన్ని అరాచక శక్తులు విద్వేషాలను రగిల్చేందుకు శతవిధాలా ప్రయత్నం పోలీసులు చేసినా వారి ఆటలు సాగనివ్వటం లేదని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
తెలంగాణ బడ్జెట్ 2022-2023 కీలక కేటాయింపులు (రూ.కోట్లలో)
బడ్జెట్ 2,56,958.51
వ్యవసాయ రంగం 24,254
ఆసరా పింఛన్లు 11,728
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ 2,750
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 12,000
దళిత బంధు 17,700
మన ఊరు-మనబడి 7,289
ఎస్టీ సంక్షేమం 12,565
పట్టణ ప్రగతి 1,394
బీసీ సంక్షేమం 5,698
బ్రాహ్మణుల సంక్షేమం 177
పల్లె ప్రగతి 3,330
ఫారెస్ట్ యూనివర్సిటీకి 100
తెలంగాణకు హరితహారం 932
రోడ్లు, భవనాల కోసం 1,542