Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల జీవోనెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్ హర్షం ప్రకటించారు. 20 ఏండ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల అడ్డంకులు ఎదుర్కొని ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శాఖల వారీగా క్రమబద్ధీకరణ వివరాలను ప్రకటించాలని కోరారు.
కాంట్రాక్టు అధ్యాపకుల హర్షం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, నాయకులు సయ్యద్ జబీ, శోభన్ హర్షం ప్రకటించారు. కాంట్రాక్టు విధానం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
చారిత్రాత్మక నిర్ణయం : ఆర్జేడీసీఎల్ఏ
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న తెలిపారు. ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు అధ్యాపకులు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. సహకరించిన మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.