Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కొక్కరికి రూ.30 లక్షలకు పైగా నష్టం
- పరిశ్రమ మూతబడినా వెంటాడుతున్న రుణాలు
- ఆర్థికభారంతో ఆత్మహత్యలు, అనారోగ్యం పాలు
- రాష్ట్రవ్యాప్తంగా 118 మంది రైతుల దీనావస్థలు
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు, ఆదాయ వనరులపై దృష్టి సారించాలని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈము రైతుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.లక్షలు, కోట్లు వెచ్చించి స్థాపించిన ఈము పరిశ్రమ దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. తద్వారా సంబంధిత రైతులు ఆర్థికంగా చితికిపోయి బ్యాంకు రుణాలు తీర్చలేక అనారోగ్యం, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
2004 నుంచి ఈము యూనిట్ల స్థాపన మొదలైనా 2008 నుంచి ఊపందుకుంది. 25% నాబార్డు, బ్యాంకుల సబ్సిడీతో స్థాపించిన ఈము పరిశ్రమ మార్కెటింగ్, ఎగుమతి సౌకర్యం లేకపోవడంతో మూడునాలుగేండ్లలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.లక్షలు, కోట్ల పెట్టుబడి పెట్టి స్థాపించిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు వారంతా బ్యాంకు రుణాలు రద్దు చేయాలని పశుసంవర్థక, ఆర్థిక మంత్రిత్వశాఖల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 50%, బ్యాంకులు 25% రుణాలను మాఫీ చేయగా రైతువాటాగా 25% చెల్లించిన విషయాన్ని ఉదాహరిస్తున్నారు.
వెంటాడుతున్న బ్యాంకు రుణాలు...
2004-2009 మధ్య కాలంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నేషనల్ లైవ్ స్టాక్ మిషన్' ద్వారా రైతులను ఈము పక్షుల పెంపకం దిశగా ప్రోత్సహించింది. ఒళ్లంతా ఔషధ గుణాలతో కూడిన ఈము మాంసం, గుడ్లు, ఈకలు, గోర్లు ప్రతి ఒక్కటీ ఎంతో లాభసాటి అని రైతులను ప్రేరేపించడంతో సుమారు 500 మంది వరకు పెంపకం చేపట్టారు. తెలంగాణ నుంచి సుమారు 200 మంది ఈము ఫామ్లను ఏర్పాటు చేస్తే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 70 మంది వరకు యూనిట్లు నెలకొల్పారు. ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండల్లో అధిక యూనిట్లు స్థాపించారు. వీరికి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ కూడా ఇచ్చారు. 50 ఆడ, 50 మగ చొప్పున వంద పక్షులకో యూనిట్ నెలకొల్పారు. ఒక్కో యూనిట్ స్థాపనకు రూ.30 లక్షల వరకు వెచ్చించారు. నాబార్డు, ప్రభుత్వ సబ్సిడీ 25% (రూ.7.5 లక్షలు)తో రైతులు ఆస్తులు, ఇండ్లు బ్యాంకులకు మార్టిగేజ్ చేసి ఈ యూనిట్లు స్థాపించారు. ఈము పక్షుల మాంసం తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు సూచించడంతో అప్పట్లోనే పావుకిలో మాంసం రూ.400 చొప్పున ధర పలికింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోని ఈము పెంపకం దారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఖమ్మం జిల్లాలో చింతకాని, కొణిజర్ల, బోనకల్, ఖమ్మం అర్బన్, తల్లాడ, సత్తుపల్లి, కూసుమంచి, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, భద్రాచలం, దమ్మపేట, బూర్గంపాడు తదితర మండలాల రైతులు, నిరుద్యోగ యువత ఈము ఫామ్స్ నెలకొల్పి తీరని నష్టాలను చవిచూశారు. బ్యాంకు రుణాలు వెంటాడుతుండటంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆర్థికభారంతో ఈము ఫామ్ల మూత...
అనేక ఒడిదొడుకుల మధ్య కూడా ఆరేడేండ్ల కిందట వరకు ఈము పక్షుల పెంపకాన్ని కొనసాగించిన రైతులు ఆర్థిక ఇబ్బందులతో పరిశ్రమకు మూతవేశారు. ఏటా ఫామ్లలో పెరిగిపోతున్న సంతతి, వాటిని మేపేందుకు ఆర్థికస్తోమత లేక నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈము పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి రైతులను ఆదుకుంది. అలాగే తమనూ ఆదుకోవాలని రాష్ట్రంలోని ఈము రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. వ్యవసాయం, పశుసంవర్థకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2018లో ఓ కమిటీని వేశారు. మొత్తం 13 బ్యాంకుల నుంచి తెలంగాణలోని 118 మంది రైతులు తీసుకున్న రుణం రూ.27 కోట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈము పరిశ్రమ నిర్వాహకులు ఆర్థికశాఖ, పశుసంవర్థకశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. కొందరు రైతులు బ్యాంకులతో వన్టైం సెటిల్మెంట్ సైతం చేసుకున్నారు. తనఖా పెట్టిన ఆస్తులు, తీసుకున్న రుణం ఆధారంగా ఈ సెటిల్మెంట్ ద్వారా నిర్ధారించిన లోన్ను చెల్లించారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో పలువురు రైతులు అనారోగ్యం పాలయ్యారు.
ఆర్థికబాధలతో ఒకరిద్దరు మరణించారు
ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ ఈము రైతుల సంఘం కన్వీనర్ బల్లేపల్లి హరిబాబు 2017లో కాజీపేటలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మరోముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒకరిద్దరు రైతుల గుండెపోటుతో మరణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ ఈము రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయమై జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వేణుమనోహర్ను వివరణ కోరగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.
ఈము రైతుల ఆదుకోవాలి...
ఈము రైతుల ఆదుకో వాలని ఇప్పటికే గవర్నర్, చీఫ్ సెక్రటరీ, ఆర్థికమంత్రి, పశుసంవర్థకశాఖ మంత్రిని కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది రైతులు ఇలా ఇబ్బంది పడ్డారు. 42 మంది సెటిల్మెంట్ చేసుకోగా 118 మంది మిగిలి ఉన్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి ఈ విషయాన్ని రిఫర్ చేశాం. 25శాతం భరిస్తామని హామీ ఇచ్చింది. మిగిలిన 50% విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందనలేదు.
- డాక్టర్ పెంచాల శ్రీనివాస్,
తెలంగాణ ఈము రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్
రూ.40 లక్షలు నష్టపోయా...
రూ.27 లక్షలు వెచ్చించి వంద పక్షులతో 2010-11లో ఈము ఫారమ్ ఏర్పాటు చేశాను. మొదట్లో రూ.6లక్షల వరకు తిరిగి చెల్లించాను. ఐదేండ్ల పాటు వాయిదాలు చెల్లించాక 25% నాబార్డు సబ్సిడీ లభిస్తుందన్నారు. కానీ ఆ సబ్సిడీ రాలేదు. ఈలోగా ఫారమ్ మూతబడింది. మొత్తంగా రూ.40లక్షల వరకు నష్టపోయాను. ప్రిన్సిఫుల్ అమౌంట్తో సహా ప్రభుత్వం మొత్తం రుణాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
-బల్లి వీరయ్య, తిర్మలాపురం, చింతకాని మండలం