Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీడీపీ, ఈజీఎస్, మండల, జిల్లా పరిషత్ ఫండ్స్ను మళ్లించడం సరిగాదు
- ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి : భట్టి విక్రమార్క
- పాఠశాలలు అభివృద్ధి చెందటం ఇష్టం లేదా?
- నియోజకవర్గ అభివృద్ధిలో అవి భాగం కావా?
- సీడీపీ ఫండ్ వాడొద్దని కాంగ్రెస్ సభ్యులు రాసివ్వండి : కేటీఆర్
- ఆరేడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలా? : దుద్దిళ్ల
- గత సమావేశాల్లో ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధమని సీఎం అనలేదా?
- వాయిదా వేయాలని మీరు కోరింది వాస్తవం కాదా? : ప్రశాంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మన ఊరు-మన బడి పథకం మంచిదే. కానీ, దానికి బడ్జెట్ ఏది? ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి), ఈజీఎస్, మండల, జిల్లా పరిషత్ నిధులను దారిమళ్లించడం సరిగాదు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఎమ్మెల్యేలందరి ఫండ్లోనూ కోతపడుతున్నది. అది గ్రహించండి' అని కాంగ్రెస్పక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాము ప్రజల సొమ్ముకు బాధ్యులమనీ, ఏ పథకానికైనా వాటి నుంచే ఇవ్వాలని అన్నారు. ఏడున్నరేండ్ల పాలనపైనే అది చేయలేదు..ఇదిచేయలేదు అంటున్న కాంగ్రెస్ సభ్యులు 65 ఏండ్లలో విద్య కోసం ఏం చేశారని ప్రశ్నించారు. 65 ఏండ్లలో నూరు, నూటయాభైకి మించి రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించలేదనీ, తమ ప్రభుత్వం 975 గురుకులాలను ఏర్పాటు చేసిందని వివరించారు. నీట్లో, ఇంజినీరింగ్లో ర్యాంకులు తెచ్చుకుంటుంటే కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై 1.20 లక్షలు ఖర్చుపెడుతున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ సభ్యులకు స్కోపే లేదన్నారు. భట్టి మాట్లాడుతూ..పథకం మంచిదిగాదనీ, పెట్టొద్దని తాము అనట్లేదన్నారు. నియోజకవర్గంలోని వేర్వేరు అభివృద్ధి పనుల కోసమే ఆ నిధులు సరిపోవట్లేదు. మళ్లీ వాటిలో కోత పెట్టి ఆ పథకానికి మళ్లించడం సరిగాదని సూచించారు. మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ 'కాంగ్రెస్ సభ్యులు తమ ఫండ్ నుంచి ఇవ్వబోమని చెప్పమనండి. బడులకు నిధులు ఖర్చుపెట్టవద్దు..విద్యార్థులపై మాకు ప్రేమలేదు. బడులు బాగుపడటం ఇష్టంలేదు..65 ఏండ్లు ఎట్ల బడ్లను గబ్బు పట్టిచ్చామో అట్లాగే ఉంచాలి..అస్సలే ఇయ్యం..అని చెప్పమనండి. ఏసీడీపీ నిధులను పాఠశాల అభివృద్ధికి వాడొద్దని కాంగ్రెస్ తరఫున రాసివ్వండి. కాంగ్రెస్ సభ్యులకు చెందే ఐదారు నియోజకవర్గాలకు ఫండ్నుంచి ఆ పథకానికి తీసుకోవడాన్ని మినహాయి ంపునిస్తాం' అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే భట్టి విక్రమార్క మైకును తీసుకుని 'అధ్యక్షా సభను, రాష్ట్రాన్ని మంత్రి డైవర్ట్ చేస్తున్నారు. రోజువారీ వినతులను పరిష్కరించేందుకు సీడీఎఫ్ను వాడుకుంటామనీ, అందులో స్కూలు, రోడ్డు, డ్రైనేజీ, రకరకాల సమస్యలుంటున్నాయన్నారు. సీడీఎఫ్ను కట్ చేయడం అధికార పార్టీ సభ్యులకు కూడా ఇష్టంలేదనీ, కాకపోతే, మేం చెబుతున్నాం, వారి చెప్పట్లేదు అంతే తేడా అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
భట్టి, దుద్దిళ్ల వర్సెస్ గంగుల, తలసాని
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..2009లో తానూ ఎమ్మెల్యేగా పనిచేశాననీ, అప్పుడూ సీడీపీ నిధులను ఇచ్చేవారన్నారు. తమకు ఇన్చార్జి మంత్రిగా శ్రీధర్బాబుగారే ఉండేవారనీ, తమకు వచ్చిన రూ.1.50 కోట్లలో రూ.75 లక్షలిచ్చి, మిగతావి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చేవారని గుర్తుచేశారు. తాము అలా చేయకుండా నేరుగా ఎమ్మెల్యేలకే ఇస్తున్నామన్నారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. డీఆర్సీ విధానం ఉండేదనీ, దాని ప్రకారమే నడుచుకునేవాళ్లమని చెప్పారు. నేడు నూటికినూరు శాతం ఇన్చార్జి మంత్రే ఇస్తున్నారనీ, ఆయన సంతకం లేనిదే జిల్లాలో ఏపనీ కాని పరిస్థితి ఉందని సభకు వివరించారు. ఇన్చార్జి మంత్రి సంతకం లేకుండా ఏదైనా పని అయితుందేమో సభ్యులను అడగండి అని ప్రశ్నించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ..ఆ పద్ధతిని తెచ్చింది ఎవరు? 94 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. దేశ చరిత్రలో రూ.5 కోట్ల సీడీపీ నిధి ఇచ్చిన ఘనత ఎక్కడా లేదన్నారు. ఎంపీలకు కూడా అంత ఇవ్వట్లేదన్నారు. 2018 నుంచి కాంగ్రెస్ ఆరుగురు సభ్యులు ఏనాడూ పూర్తిస్థాయిలో సభకు వచ్చింది లేదనీ, ఇక్కడొకటి మాట్లాడి, బయటకెళ్లి మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శ్రీధర్బాబు మాట్లాడుతూ..1994లో ఈ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. శాసనసభ చరిత్రలోనే ఆరేడు రోజుల్లో బడ్జెట్ను ముగించిన ఘనత టీఆర్ఎస్దేనని దెప్పి పొడిచారు. బడ్జెట్పై రోజులతరబడి చర్చించేవారనీ, అందరికీ అవకాశం ఇచ్చేవారని గుర్తుచేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..వాళ్లు మంచిగ నడిపించినంత మంచిగ తాము నడుపుతలేమన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. 15 రోజులు నడిపిస్తే..అందులో రోజుకు గంట, గంటన్నరకు ఎక్కువ నడపకపోయేవారనీ, నిజాం క్లబ్లో లంచ్ చేసేవారని విమర్శించారు. తాము అలా చేయకుండా రోజుకు కనీసం ఏడు గంటలు సభను నడుపుతున్నామనీ, ప్రజా ధనాన్ని వృథా చేయట్లేదన్నారు. వాళ్ల హయాంలో పద్దులపైన చర్చనే జరగకపోయేదనీ, తాము పద్దుల మీద ఆరుగురు సభ్యులున్నా ప్రతిపక్షాలకు అడిగినంత సమయం(రోజుకు గంట, గంటన్నర) ఇస్తూ చర్చిస్తున్నామని చెప్పారు.
మేమెప్పుడూ బహిష్కరించలేదు
అసెంబ్లీలో గతంలో చర్చల సందర్భంగా ప్రస్తుత మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావు బల్లల మీదకెళ్లి దూకినా, స్పీకర్ కుర్చీవరకెళ్లి పేపర్లు చింపేసినా ఏనాడూ సభ నుంచి బహిష్కరించలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సహకరిస్తేనే సభ నడుస్తుందన్నారు.
పాఠశాలల్లోని పారిశుధ్య కార్మికుల్ని పర్మినెంట్ చేయండి
'పాఠశాలలను ఊడ్చి శుభ్రం చేసేవారికి రూ.2,500 మాత్రమే ఇస్తున్నారు. వారి ఉదయం ఆరుగంటలకు పాఠశాలకు వెళ్లాలి. అక్కడ ఊడ్చినట్టు ఫొటోను గ్రామ కార్యదర్శి తీస్తున్నారు. మళ్లీ సాయంత్రం వదిలిపెట్టేదాకా బడిలోనే ఉంటున్నారు. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏరోజైనా పర్మినెంట్ కాకపోతుందా? అన్న చిన్న ఆశతో వారు బతుకులను ఈడుస్తున్నారు. దయచేసి వారిని రెగ్యులరైజ్ చేయండి. వారి జీతం పెంచండి' అని భట్టి విక్రమార్క శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రయివేటు స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరారు. చైతన్య, నారాయణ లాంటి చైన్ ఆఫ్ స్కూళ్లు పిల్లలను మిషన్లుగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్కూళ్ల వల్ల స్వయం ఉపాధి కోసం నిరుద్యోగులు కనీసం స్కూళ్లు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఆ రెండు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండవన్నారు. కానీ, సంపద మాత్రం కొందరి వద్దనే పోగవుతున్నదన్నారు. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. యూనివర్సిటీలకు ఫండ్ కేటాయించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. పర్యాటక రంగం విస్తరణకు రాష్ట్రంలో విస్తారంగా అవకాశాలున్నాయనీ, ఆవైపుగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవాలని కోరారు. క్రీడా స్టేడియాలకు నిధులు వెచ్చించాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ బోర్డు వివాదాలతో హెచ్సీఏ ప్రతిష్ట మసకబారిందనీ, దానికి పూర్వవైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. గిరిజన వికాస కేంద్రాలను తీసేయొద్దని విన్నవించారు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రమాదకరం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం చాలా ప్రమాదకరనీ, దీనిని తీసుకొచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనలను ఏమైనా కేంద్రం అడిగిందా? లేదా? అడిగితే ఏం చెప్పారు? అనే విషయాన్ని సభకు చెప్పాలని భట్టి విక్రమార్క అడిగారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో చరిత్రను వక్రీకరిస్తున్నారనీ, విద్యను కాషాయీకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే పిల్లల మెదళ్లల్లో విషాన్ని నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. జాతి చరిత్రనే బీజేపీ వక్రీకరిస్తున్నదన్నారు. ఈ పాలసీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మేధావులు, రాజకీయపార్టీల నేతలు, విద్యాసంస్థల అధినేతలు, తదితరులతో మాట్లాడాలన్నారు. దేశానికి దశ, దిశ నిర్దేశించే విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.