Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ - భువనగిరి
వైద్య వృత్తిలో మనస్ఫూర్తిగా.. సంతోషంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యార్థులకు సూచించారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ ఆలిండియా మెడికల్ సైన్స్ కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్ వైట్ కోటు వేడుకలో ఆమె పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో వినియోగించే తెల్ల కోటు సేవా రంగానికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు చిహ్నమన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. తన మాతృమూర్తి వైద్య తృత్తి పట్ల గౌరవంతో తనను తెల్ల కోట్లో డాక్టర్గా చూడాలనే కోరికను నెరవేర్చారన్నారు. తాను వైద్య వృత్తిలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల పట్ల దృష్టి పెట్టాలని, పేషెంట్ల పట్ల శ్రద్ధ వహించి సేవలు అందించాలని కోరారు. కొత్తగా వైద్య రంగంలోకి వస్తున్న వారు పేషెంట్లకు అందించే చికిత్స పట్ల వారికి అవగాహన కలిగించాలన్నారు. ప్రధానమంత్రి వైద్యరంగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పట్ల శ్రద్ధతో ఎయిమ్స్లో అధ్యాపకులను, వసతులను పెంచారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో చేపట్టిన వైద్యసేవలు ప్రపంచంలోనే పెద్దవన్నారు. జన ఔషధ్ ద్వారా తక్కువ ధరలో మందులు లభిస్తున్నట్టు తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని, తెలంగాణకు ఎయిమ్స్ గౌరవ చిహ్నమని అన్నారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా నేతృత్వంలో అద్భుతమైన సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో వైద్యరంగంలో ఎయిమ్స్ అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ద్వారా అందుతున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ వివరించారు. అనంతరం గవర్నర్ ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటారు.
ఎయిమ్స్లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, డీన్ రాహుల్ నారంగ్, ప్రొఫెసర్స్ సంగీతా సంపత్, నితిన్ అశోక్, గూడూరు నారాయణరెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.