Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతరిస్తున్న పార్టీకి అధ్యక్షులు రేవంత్రెడ్డి
- మంత్రి శ్రీనివాస్గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు బీసీలను అవమానపర్చడమే..: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంతరిస్తున్న పార్టీకి రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షులయ్యారని, దమ్ముంటే కొడంగల్ నుంచి గెలవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్రెడ్డి, ఏ.వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం కొల్లాపూర్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డికే గతి లేదు కానీ.. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సభలు పెట్టి టికెట్లు అమ్ముకునే వ్యాపారం మొదలు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ సభలకు వచ్చిన జనాలే ఓట్లు వేయడం లేదని, దేశమంతా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోతుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానపరచడమేనన్నారు. సీఎం అంటే.. మంత్రులంటే రేవంత్కు గౌరవం లేదన్నారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. మన ఊరు- మన పోరు అని కాదు.. ఆ కార్యక్రమం పేరు బూతు పురాణం సభ అని పెట్టుకోవాలని సలహానిచ్చారు. కోర్టుల్లో ప్రాజెక్టులను అడ్డుకుంటూ ప్రాజెక్టులు నిర్మించడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
దమ్ముంటే మల్కాజ్గిరిలో లేదా పాలమూరులో గెలిచి చూపించాలన్నారు. పాలమూరు ప్రజల ఆత్మ రేవంత్ మాటలతో క్షోభిస్తుందన్నారు. జైపాల్రెడ్డిని బతికి ఉన్నప్పుడు తిట్టి.. ఇప్పుడు పొగుడుతున్నారని విమర్శించారు. రేవంత్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కోల్పోయేలా చేస్తామన్నారు. రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తనపై కొడంగల్లో రేవంత్ పోటీకి రావాలని, మరోసారి ఓడించి చూపిస్తానంటూ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా రేవంత్ పాలమూరు జిల్లాలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా గెలిపించలేరని ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న రేవంత్కు పాలమూరు ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. హోదా పెరిగినా రేవంత్ బుద్ది మారడం లేదని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు.