Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 171 కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదనీ, ఒక మెడికల్ కాలేజీకి రూ.200 కోట్లు కేటాయించారని తెలిపారు. నవోదయ విద్యాలయాల కేటాయింపుల్లోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలు ఏం చదువుకోవద్దా? అని నిలదీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంపదలో వాటా రావాల్సిందేనన్నారు. ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ, ఐఐఎంగానీ, ఎయిమ్స్ నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిమ్జ్ వంటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదనీ, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం కేంద్రానికి తగదని చెప్పారు. సింగరేణి ఆస్తులను కాపాడేందుకు కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకోవాలని కోరారు. ఈ దేశ సంపదను బీజేపీ అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.