Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం
- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐకేపీ,సెర్ప్, మెప్మా ఉద్యోగులకు వేతనాలు : కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదనీ, కొన్ని భ్రమలకు లోనై నాడు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినలేదని చెప్పారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నారన్నారు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై సమ్మెను పునరావృతం చేయొద్దని సూచించారు. మానవతా దృక్పథంతో వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెర్ఫ్లో 4,500 మంది పని చేస్తున్నారన్నారు. మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ సామర్ద్యం పెంచేందుకు వారు విశేష కృషి చేస్తున్నారన్నారు. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ , ఆర్థిక శాఖల మంత్రులు లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ తెలిపారు.