Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని పంటల కాలనీలుగా విభజించాలి
- : మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరమన్న ప్రణాళిక ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. పంటల మార్కెంటింగ్, ఎగుమతులకు కేంద్ర సాయం చేయట్లేదని విమర్శించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్నగర్ జిల్లా శిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలను మంత్రి నిరంజన్రెడ్డి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాన్ని పంట కాలనీలుగా విభజించాల్సిన అవసరముందన్నారు. కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాలని కోరారు. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తున్నదని విమర్శించారు. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లేలా చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ ఏడేండ్లపాలనలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయిందని విమర్శించారు. పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది తమ ఉద్దేశమన్నారు. తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించినట్టు వివరించారు. బృందంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు ఉన్నారు.