Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి సర్కారు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీ కెనాల్(కర్నూలు-కడప)కు కేటాయించిన జలాలను కేవలం సుంకేసుల ఆనకట్ట నుంచి మాత్రమే తరలించేలా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిబంధనలకు విరుద్ధంగా కేసీ కెనాల్కు ఏపీ ప్రభుత్వం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, నిప్పులవాగు ఎస్కేప్ తదితర మార్గాల ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-1(కేడబ్ల్యూటీ-1)కు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ విషయంలో వెంటనే స్పందించి కృష్ణా నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్న చోట నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనీ, ఏపీ ప్రభుత్వ జలచౌర్యాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మెన్కు శనివారం రాష్ట్ర తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ లేఖ రాశారు. వాస్తవానికి కేసీ కెనాల్కు కేటాయించిన జలాలు 10 టీఎంసీలేననీ, కానీ ఏపీ ప్రభుత్వం నీటి తరలింపును 39.9 వేలకు పెంచుకుందనీ, అది కూడా కేసీ కెనాల్ ద్వారా కృష్ణా బేసిన్ అవతల ప్రాంతాలకు నీటిని అక్రమంగా తరలిస్తున్నదని విమర్శించారు. మొదటి నుంచి అంతరాష్ట్ర నీటి ఒప్పందాలను ఏపీ సర్కారు ఏకపక్షంగా ఉల్లంఘిస్తున్నదనీ లేఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్ నిరసన వ్యక్తం చేశారు. మార్గదర్శకాల ప్రకారం సుంకేసుల జలాశయం నుంచి మాత్రమే నీటిని కేసీ కెనాల్కు నీటిని తరలించాల్సి ఉండగా, అక్రమంగా శ్రీశైలం రిజరాయర్ నుంచి తరలిస్తున్నదని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులరేటర్ వద్ద 883 అడుగుల వద్ద హంద్రినీవా ప్రాజెక్టులోని మల్యాల పంప్హౌజ్ వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి కేసీ కెనాల్ తుంగభద్ర నది నుంచి మాత్రమే నీటిని తరలించాలనీ, అంతే తప్ప కృష్ణా నది నుంచి నేరుగా నీటిని తీసుకుపోవద్దని కేడబ్ల్యూటి-1 స్పష్టం చేసిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేశారు. కాగా ఏపీ సర్కార్ మాత్రం పోతిరెడ్డిపాడు, హంద్రినీవా ద్వారా అక్రమంగా కేసీ కెనాల్కు తరలించుకుపోతున్నదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అంతరాష్ట్ర నీటి ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇకనైనా కేఆర్ఎంబీ స్పందించి కేసీ కెనాల్కు నీఇ తరలింపు విషయంలో అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.