Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు స్వరాజ్యం కన్నుమూత
- అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి
- నేడు ఎంబీ భవన్కు భౌతికకాయం
- ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రజల సందర్శనార్ధం
- నల్లగొండలో 12 గంటలకు సంతాపసభ
- అనంతరం మెడికల్ కాలేజీకి పార్థీవదేహం అప్పగింత
- రాఘవులుతోపాటు పలువురి నివాళి
- సీపీఐ(ఎం) సహా పలు రాజకీయ పార్టీల సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని (ఉమ్మడి నల్లగొండ) కర్విరాల కొత్తగూడెంలోని ఓ భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో ఆమె జన్మించారు. వారు ఐదారు వందల ఎకరాల భూస్వాములు. స్వరాజ్యం ఐదో తరగతి వరకే విద్యనభ్యసించారు. ఆమె అన్న భీమిరెడ్డి అడుగుజాడల్లో పోరాటపంథాలోకి వచ్చారు. 1945-48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలను కదిలించేలా అనేక సభలు నిర్వహించారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించారు. తుపాకీ తూటాల్లాంటి మాటలతో మహిళలను చైతన్యపర్చడంలో కీలకపాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతోపాటు మూడొందల మంది మహిళలు మేజర్ జైపాల్సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. 75 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆమె రెండు సార్లు 1978, 1983లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహ్మారెడ్డి (వీఎన్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్ నాలుగో తేదీన మరణించారు. వారికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యులు), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) ఉన్నారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ధీరవనిత స్వరాజ్యం : రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు
మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు. రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో ముందు నడిచి తెలంగాణ సమాజానికి విముక్తి కలిగించిన ధీరవనిత స్వరాజ్యం. ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువత నినదించింది. తమ్మినేని పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగం నాకు స్ఫూర్తి కలిగించింది. నా కుటుంబానికి, నా కుమార్తెకు మల్లు స్వరాజ్యం ఆదర్శం. స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ వీరనారికి నివాళులర్పిస్తున్న. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.
నిజాంను ఎదిరించిన ధీశాలి : పి మధు, మాజీ ఎంపి
తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు నడిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం. మత సామరస్యం కోసం, ప్రయివేటు,
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ధీశాలి. నైజాం నిరంకుశ పాలనను ఎదిరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం మిగిలిన కర్తవ్యాల కోసం జీవితాంతం ఉద్యమించారు. భర్త వెంకట నర్సింహారెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేద ప్రజలకు తమ సొంత భూములు పంచిపెట్టారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మల్లు స్వరాజ్యం వ్యతిరేకించారు. మత సామరస్యం కోసం ఆమె కృషి చేశారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం హరిస్తుంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఆమె నినదించారు. విప్లవ ఆశయం కోసం జీవితాన్ని అంకితం చేసిన వీరవనితకు తెలుగు ప్రజల తరుపున జోహార్లు అర్పిస్తున్న.
పలువురి నివాళి
మల్లు స్వరాజ్యం మరణం పట్ల సీపీఐ(ఎం)తోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నేతలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మల్లు స్వరాజ్యం మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, పెనుమల్లి మధు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి వెంకట్, డిజి నరసింహారావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎ రేవంత్రెడ్డి కేర్ ఆస్పత్రిని సందర్శించి ఆమె భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, ఏపీ ఐద్వా నేత స్వరూపరాణి ఆస్పత్రికి వెళ్లి మల్లు స్వరాజ్యంను పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులు, డాక్టర్లను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారు పరామర్శించిన కొద్ది గంటలకే రాత్రి 7.30 గంటలకు ఆమె చనిపోయారు.
యువతరానికి ఆమె ఆదర్శం : వి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి
మల్లు స్వరాజ్యం యువతరానికి ఆదర్శం. ఆఖరి క్షణం వరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆమె ఆదర్శాలకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ ముందుకుపోతుంది. ఆమె ఆశయాల సాధనకోసం, అవినీతిరహిత సమాజం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
ఆమె త్యాగాలు వృధాకావు : జూలకంటి, మాజీ ఎమ్మెల్యే
వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి కావాలని నినదించిన వీర వనిత మల్లు స్వరాజ్యం. ఉద్యమంలో అనేక ఆటుపోట్లు, నిర్బంధాలు ఎదురైనా ఎర్రజెండా వీడకుండా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆమె త్యాగాలు వృధాకావు. ఆశయ సాధన కోసం ఉద్యమిస్తాం.
ఉద్యమాలతోనే ఆమెకు నివాళి : ఎస్ వీరయ్య, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
జమిందారు, జాగీర్దారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి. పార్లమెంటరీ రాజకీయాలు కొనసాగిస్తూనే ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఉద్యమాల ద్వారానే ఆమెకు నిజమైన నివాళి.
తుదిశ్వాస వరకు ఉద్యమాన్ని వదల్లేదు : బి వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
తుదిశ్వాస విడిచే వరకు ఉద్యమాన్ని వదల్లేదు. కార్పోరేట్ వ్యవసాయం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తి.
రేపటి తరాలకు మల్లు స్వరాజ్యం స్ఫూర్తి
సాయుధపోరాట యోధురాలి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం జీవితం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆమె మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంతాప ప్రకటన విడుదల చేశారు. ఆనాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు స్వరాజ్యం అని గుర్తుకు చేసుకున్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిషలు కృషి చేశారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేడు ఎంబీ భవన్కు భౌతికకాయం
మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచుతారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం సంతాప సభ నిర్వహిస్తారు. ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సుభాషిణీఅలీ, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. ఆ తర్వాత అంతిమయాత్రగా బయల్దేరి మధ్యాహ్నం మూడున్నర గంటలకు మెడికల్ కాలేజీకి చేరుకుంటారు. అనంతరం ఆమె పార్థీవదేహాన్ని ఆ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు వైద్యకళాశాలకు అప్పగిస్తారు.