Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలికి శ్రద్ధాంజలి
- పెంచిన ప్రేమలు పంచిన తల్లి స్వరాజ్యం'అంటూ స్మరణ
- రాఘవులు, సుభాషిణీఅలీ, కె నారాయణ, కోదండరామ్,
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కవిత ఘననివాళి
- ఎంబీ భవన్లో అశ్రునయనాలతో వీడ్కోలు
- కడసారి చూసేందుకు భారీగా వచ్చిన కార్యకర్తలు, కుటుంబసభ్యులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంకు హైదరాబాద్లోని ఎంబీ భవన్లో అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ''అమ్మ స్వరాజ్యం... మా తల్లి స్వరాజ్యం, పెంచిన ప్రేమలు పంచిన తల్లి స్వరాజ్యం''అని ప్రజానాట్యమండలి కళాకారుల పాట అందరినీ గుండెలను కదిలించింది. ఆమె జ్ఞాపకాలను స్మరించుకునేలా చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రి నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్కు ఆమె భౌతికకాయాన్ని తెచ్చారు. ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి వెంకట్, కుటుంబ సభ్యులు మల్లు లక్ష్మి, మల్లు నాగార్జునరెడ్డి ఆమె భౌతికకాయంపై ఎర్రజెండాను కప్పారు. పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జోహార్ మల్లు స్వరాజ్యం, రెడ్సెల్యూట్ మల్లుస్వరాజ్యం, అమర్రహే మల్లు స్వరాజ్యం, సాధిస్తాం ఆమె ఆశయాలను, లాంగ్లీవ్ మల్లు స్వరాజ్యం' అంటూ పెద్దఎత్తున పలుమార్లు నినాదాలు చేశారు. ఆ ప్రాంతమంతా ఆ నినాదాలతో మార్మోగిపోయింది. ఆమెను కడసారి చూసేందుకు ఎంబీ భవన్కు పార్టీ కార్యకర్తలు, వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కుటుంబసభ్యులు, అభిమానులు భారీగా తరలొచ్చారు. ఆమె భౌతికకాయంపై పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు సుభాషిణిఅలీ, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు పెనుమల్లి మధు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, పశ్యపద్మ, విఎస్ బోస్, సీనియర్ నేత కందిమళ్ల ప్రతాప్రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, రామ్మోహన్రెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్, సంపాదకులు ఆర్ సుధాభాస్కర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు వేములపల్లి వెంకట్రామయ్య, బి ప్రదీప్, ఝాన్సీ, ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకులు స్వామిగౌడ్ ఆమె భౌతికకాయంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, టి జ్యోతి, జాన్వెస్లీ మాజీ కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డితోపాటు వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
కుటుంబ సభ్యుల నివాళి
మల్లు స్వరాజ్యం కుమారులు మల్లు గౌతంరెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళ్లు రవికాంత్రెడ్డి, శశికాంత్రెడ్డి, అరుణ్, ఆదిత్య, వంశీ, విద్య, స్రవంతి, ప్రతిభ, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఎంబీ భవన్కు వచ్చి భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లు స్వరాజ్యం జ్ఞాపకాలను, చేసిన పోరాటాలను, ఆదర్శ భావాలను గుర్తు చేసుకుని విలపించారు.
పలువురి శ్రద్ధాంజలి
ఐద్వా సీనియర్ నాయకులు అమ్మాజీ, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, ఏపీ ఐద్వా నాయకులు స్వరూపరాణి, ఎస్వీకే ట్రస్టు మాజీ కార్యదర్శి సి సాంబిరెడ్డి, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలగుడు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, ఏపీ నాయకులు ఎం బాలకాశి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు, కోశాధికారి ఆర్ వరప్రసాద్, మాజీ అధ్యక్షులు అందెసత్యం, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, కోశాధికారి ఎం లక్ష్మారెడ్డి, కార్యదర్శి ఈ గాలయ్య, నాయకులు కమలకుమారి, తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి, నాయకులు అనంతోజు మోహన్కృష్ణ, ఎస్కె సలీమ, గాయకుడు ఏపూరి సోమన్న, సామాజిక కార్యకర్తలు దేవి, శాంతారావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్, బీఎస్ఎన్ఎల్ఈయూ నేత సాంబశివరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేత ప్రేంపావని, పీవోడబ్ల్యూ సంధ్య, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధులు ఆర్ వెంకట్రెడ్డి, ప్రకాశ్, పట్నం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవిఎస్ఎన్ రాజు, నాయులు డీఏఎస్వి ప్రసాద్, కె ఉమామహేశ్వరరావు, లోకేశ్వర్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, అడ్వకేట్ రాపోలు భాస్కర్, నల్లగొండ గద్దర్ నర్సన్న, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు బి రవికుమార్, తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, నియోకర్సర్ ప్రతినిధి జి జగదీశ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్, ఐజేయూ నేత కె శ్రీనివాస్రెడ్డి, టీజేఎఫ్ అధ్యక్షులు పల్లె రవికుమార్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, సామాజిక కార్యకర్త సజయ తదితరులు మల్లు స్వరాజ్యం భౌతికకాయంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఎంబీ భవన్ జనసంద్రం
ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఎంబీ భవన్ నుంచి ఆమె భౌతికకాయాన్ని నల్లగొండకు తరలించారు. ఈ సమయంలో 'అమ్మ స్వరాజ్యం... మా తల్లి స్వరాజ్యం, పెంచిన ప్రేమలు పంచిన తల్లి స్వరాజ్యం'అంటూ పీఎన్ఎం కళాకారులు సాంబరాజు యాదగిరి, సైదులు, వినోద్ పాడిన పాటకు అందరూ కంటతడి పెట్టారు. ఒక్కసారిగా అక్కడున్న వారిందరి గుండెలు బరువెక్కాయి. 'జోహార్ మల్లు స్వరాజ్యం, రెడ్సెల్యూట్ మల్లు స్వరాజ్యం, సాధిస్తాం మీ ఆశయాలను'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆమె భౌతికకాయాన్ని అంబులెన్స్ ఎక్కించారు. ఎంబీ భవన్ చుట్టు పక్కల మొత్తం దారులన్నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. జనసంద్రంగా మారింది. నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ప్రదర్శనగా వెళ్లి అంబులెన్స్ను సాగనంపారు. అనంతరం సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఐద్వా రాష్ట్ర కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆమె భౌతికకాయాన్ని ఉంచి నల్లగొండకు తీసుకునిపోయారు.
వీరనారి అంటే మల్లు స్వరాజ్యం : తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులు
మల్లు స్వరాజ్యం అపూరూపమైన చైతన్యమూర్తి. ప్రజల్లో మమేకమైన వారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఆమె ఒకరు. తెలంగాణ ప్రజలకు సంబంధించి వీరనారి అంటే ఆమె గుర్తొస్తుంది.
ఆమె పోరాటం అందరికీ స్ఫూర్తి : కె జంగయ్య, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు
ఆమె మరణం తెలంగాణకు, దేశానికి తీరనిలోటు. రాష్ట్రంలోని యువతీయువకులకు స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని నడిపారు. భూమికోసం భుక్తి కోసం నిజాం పాలన విముక్తి కోసం పోరాడారు. అందరికీ ఆమె జీవితం ఆదర్శం. ఆమె లేనిలోటు తెలుస్తున్నది.
పోరాట స్ఫూర్తి నేటి తరానికి అవసరం-న్యూడెమోక్రసీ
నిజాం నిరంకుశత్వానికి, వెట్టి చాకిరి, దొరల పాలనకు వ్యతిరేకంగా సాయుధ గెరిల్లాగా మారి బంధూకు పట్టిన మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి నేటి తరానికి అవసరమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వరాజ్యం మరణం పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
మల్లు స్వరాజ్యంకు నివాళులు- ఐద్వా
వీరనారి మల్లు స్వరాజ్యం మరణం మహిళా ఉద్యమనికి తీరని లోటనీ, అనేక మంది మహిళలకు పోరాట స్ఫూర్తినింపిన మల్లు స్వరాజ్యంకు ఆదివారం హైద రాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో విడ్కోలు పలుకుతూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, కార్యదర్శి మల్లు లక్ష్మి, టి. జ్యోతి, ఆశాలత, ఇందిర, హైమావతి, బుగ్గవీటి సరళ, సబ్బని లత, మహేశ్వరి, పద్మ, లక్ష్మమ్మ, వినోద, సృజన, నాగలక్ష్మి, పసుపులేటి రమాదేవి, లక్ష్మి, స్వర్ణలత పాల్గొన్నారు.
కమ్యూనిస్టు రాజ్యం కోసం పనిచేయాలి
బాల్యంలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్షితురాలై భూస్వాముల మెడలు వంచారు. భూమిని పంచడంలో కీలకపాత్ర పోషించారు. తుదిశ్వాస విడిచే వరకూ ఎర్రజెండాను వదల్లేదు. ఆమె ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. కమ్యూనిస్టు రాజ్యం రావాలన్నదే ఆమె ఆశయం. దాని కోసం పనిచేయాలి. దోపిడీ రాజ్యం పోవాలి. వామపక్షాల ఐక్యత కావాలి. ఐక్యఉద్యమాలతో ఆమె ఆశయాలు సాధించాలి. భూమి, భుక్తి సమస్యపై మళ్లీ ఉద్యమించడమే ఆమెకు నిజమైన నివాళి.
- చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రాజకీయాలు ప్రజల కోసం
అలాంటి నాయకులు ఉద్యమాల్లోకి రావడం అరుదు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె రాటుదేలారు. సామాజిక నేపథ్యాన్ని పక్కనపెట్టి నిజాయితీగా, నిక్కచ్చిగా నిలబడ్డారు. ప్రజల హక్కుల కోసం వీరోచితంగా పోరాడారు. భూమి, భుక్తి కోసం ఉద్యమించారు. ఒక మహిళ రాజకీయాల్లో ఆ స్థాయికి చేరడం చారిత్రాత్మకం. పేదల పక్షాన, నిక్కచ్చిగా నిలబడాలన్నదే ఆమె నుంచి స్ఫూర్తిపొందాలి. రాజకీయాల్లో నిజాయితీ లేదు. వ్యాపారంగా మారాయి. ప్రజల కోసం రాజకీయాలను నడిపిన వ్యక్తి స్వరాజ్యం. అలాంటి పరిస్థితులు మళ్లీ పునరుద్ధరించాలి.
- ఎం కోదండరామ్, టీజేఎస్ అధినేత
తెలంగాణకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికే స్ఫూర్తిగా నిలిచారు. ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. ఉద్యమాలకే ఆమె స్ఫూర్తినింపారు. ఆనాడు పోరాటం చేసినపుడు తుపాకీ పట్టిన మొదటి మహిళగా కీర్తి పొందారు. నిజాం ప్రభుత్వం రూ.పది వేలు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో, ప్రజల కోసం, సిద్ధాంతం కోసం పనిచేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమెను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం. ఆశ కోల్పోవద్దు, గమ్యం చేరుకోవాలని ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం కలిసి పనిచేస్తాం.
- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
వామపక్ష ఉద్యమాలకు స్ఫూర్తి
సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంపైనా ఉద్యమించారు. ఆమె త్యాగాలు, పోరాట గాథలు నేటితరం తెలుసుకోవాలి. ఎవరితోనైనా నిర్మోహమాటంగా మాట్లాడతారు. వామపక్ష ఉద్యమాలకు ఆమె స్ఫూర్తి.
- కె నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఆమె జీవితంపై పుస్తకాలు, సినిమాలు రావాలి
ఆమె స్ఫూర్తితో పనిచేయాలన్న కోరిక ఉంది. 1982లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 1983లో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె మాట్లాడే తీరు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పార్టీ క్రమశిక్షణతో ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఆమె స్ఫూర్తి చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఆమెను మరిచిపోకుండా చూడాలి. అందులో భాగంగా ఆమె జీవిత చరిత్ర, పోరాటాల గురించి పుస్తకాలు, సినిమాలు రావాల్సిన అవసరముంది. అందుకు నా అండదండలుంటాయి.
- ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి