Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా విడుదలకాని వేతనాలు, బకాయిలు
- పెండింగ్ బిల్లుల కోసం రేపు డీటీవోల ఎదుట నిరసనలు
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్థిక సంవత్సరం ముగింపుకొస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ తెలిపింది. వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా ట్రెజరీ కార్యాలయాలు (డీటీవో) ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులు, పింఛనర్ల సప్లిమెంటరీ వేతనాలు, సెలవుల జీతాలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్, పీఆర్సీ, డీఏ బకాయిలు తదితర వేలాది బిల్లులు నెలల తరబడి ప్రభుత్వ ఆమోదం కోసం ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్నాయని వివరించింది. సంఘాల ద్వారా ప్రాతినిధ్యం చేస్తే కొన్ని బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలిపింది. గత మూడు వారాలుగా వాటినీ నిలిపివేశారని పేర్కొంది. 317 జీవో ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయుల జనవరి సప్లిమెంటరీ వేతనాలు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలూ పెండింగ్లో ఉన్నాయని వివరించింది. మరోత పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదని పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి ఉన్న బిల్లులను మార్చి 31 వరకూ మంజూరు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిందని తిరస్కరించారని గుర్తు చేసింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలి పింది. ఈ పరిస్థితి సమీక్షించిన యూ ఎస్పీసీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ముందుగానే మెమోరాండమ్ను సమర్పించిందని పేర్కొంది. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రకటించింది. ఉపాధ్యాయులు, పింఛనర్లు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరింది.