Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
- ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. వచ్చేనెల నాలుగో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడతామన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ మంజూరు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని విమర్శించారు. అందుకోసం నిధులు కేటాయించలేదని చెప్పారు. 14 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారనీ, అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3.18 లక్షల మంది మాత్రమే అర్హులంటూ ప్రభుత్వం ప్రకటించడం సరైంది కాదన్నారు. ఆసరా పింఛన్ను రూ.ఐదు వేలకు పెంచాలని కోరారు. అర్హత ఉన్నవారందరికీ రేషన్కార్డు ఇవ్వాలని చెప్పారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాటలతో సరిపెట్టకుండా ఆచరణలో అమలు చేయాలని కోరారు. కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 28,29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటిలా ఉందన్నారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య మాట్లాడుతూ కార్మికులు, రైతులు కలిసి ఈనెల 28,29 తేదీల్లో చేస్తున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తున్నామని చెప్పారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయల చంద్రశేఖర్ మాట్లా డుతూ సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్స్వామి అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఎవరి విశ్వాసాలు వారికుంటాయనీ, వీరవనితలను అవమానించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ, రాష్ట్ర నాయకులు ఎం హన్మేష్, సూర్యం, ఎస్ఎల్ పద్మ పాల్గొన్నారు.