Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్కు రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాలను మోపిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పెంచిన చార్జీలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిందని తెలిపింది. ఇంత భారీ మొత్తంలో వేసిన భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిస్కాంలు పెట్టిన పెంపుదల ప్రతిపాదనలను ఉన్నదున్నట్టు రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించడమంటే వాటిని సమగ్రంగా పరిశీలించలేదని అర్థమవుతున్నదని తెలిపారు. గృహ వినియోగదారులైన 60 లక్షల మందికి ప్రస్తుతం యూనిట్కు రూ.1.45 పైసలు ఉందనీ, యూనిట్కు 50 పైసలు పెంచి దాన్ని రూ.1.95 పైసలు అంటే 34 శాతం పెంచారని విమర్శించారు. పరిశ్రమలపైన ప్రస్తుతమున్న యూనిట్ చార్జీలపై రూపాయి మేర పెంచిందని వివరించారు. దీంతో ప్రస్తుత భారానికి 25 శాతం నుంచి 30 శాతం వరకు పెంపుదల చేశారని పేర్కొన్నారు.మొత్తం డిస్కాంలకు రావాల్సిన ఆదాయాన్ని 25శాతం పెంపుదల చూపారని తెలిపారు. టారీఫ్ రేట్ల బహిరంగ విచారణలో పాల్గొన్న అనేక మంది చార్జీలు పెంచొద్దనీ, భారాలను ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని శాస్త్రీయంగా వివరించారని గుర్తు చేశారు. గత నాలుగేండ్లలో డిస్కాంలు రూ.36 వేల కోట్ల అప్పులు చేశాయని వివరించారు. 2022-23 సంవత్సరానికి మరో రూ.11 వేల కోట్ల లోటును చూపించాయని తెలిపారు. కానీ రెగ్యులేటరీ కమిషన్ డిస్కాంలు చూపినదానికన్నా రూ.రెండు వేల కోట్ల భారాన్ని అదనంగా చూపడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. డిస్కాంలు తమ అంతర్గత సామర్థ్యాన్ని అభివద్ధి చేసుకోవడం ద్వారా చార్జీలను పెంచాల్సిన అవసరముండబోదని సూచించారు. కానీ డిస్కాంలు చార్జీల పెంపుపైనే దృష్టి పెట్టాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉండడంతో నష్టాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ ఖర్చులను బాగా పెంచి ఈ నష్టాలు మరింత పెరగడానికి తోడ్పడుతున్నాయని వివరించారు. బహిరంగ మార్కెట్లో అతితక్కువకు లభ్యమవుతున్న విద్యుత్ను కొనకుండా, ఎక్కువ రేట్లకు వేలంలో పాడినవారి దగ్గర కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 'ఆర్డర్ ఆఫ్ మెరిట్ డిస్పాచ్' ప్రకారం ఎసెండింగ్ విధానంతో విద్యుత్ను వినియోగించినచో నష్టాలు తగ్గుతాయని సూచించారు. కానీ ఎసెండింగ్కు బదులు డిసెండింగ్ ఆర్డర్ను విద్యుత్ శాఖ అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ విద్యుత్ జనరేషన్ కంపెనీల నుంచి కాకుండా అధిక ధరలకు అమ్మే ప్రయివేటు జనరేషన్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడంతో చార్జీల భారాన్ని వినియోగదారులపై వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ను కొనుగోలు చేసి వృధా ఖర్చును తగ్గించడం ద్వారా భారాలు పెంచకుండా సరఫరా చేయొచ్చని సూచించారు. అందువల్ల పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.