Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశభక్తి ముసుగులో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
- ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం దారుణం
- లేబర్ కోడ్లతో కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాదం
- అందుకే 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
- కార్మికులు, ప్రజలంతా జయప్రదం చేయాలని కోరుతున్నాం
- ఆన్లైన్ బహిరంగ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగేసుకుని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దేశద్రోహ విధానాలను అనుసరిస్తున్నదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకే ప్రమాదకరమని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు, కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్కోడ్లను తిప్పికొట్టేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశభక్తియుత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదాన్ని కోరుతూ గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆన్లైన్ బహిరంగ సభను నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు అధ్యక్షత వహించారు.
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ..కార్మిక వర్గానికి, దేశ భవిష్యత్కు మార్గం చూపేరీతిలో సమ్మె చేయబోతున్నామన్నారు. తాము చేపట్టబోయేది వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదనీ, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటమని నొక్కి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి రోజుకు రూ.178 వేతనం ఇస్తే సరిపోతుందని నిర్ణయించడం దుర్మార్గమనీ, ఆ లెక్కన నెలకు రూ.5400 వేతనంతో ఎలా బతకాలో ఆ పాలకులే చెప్పాలని ప్రశ్నించారు. సహజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం దేశభవిష్యత్కే నష్టదాయకమని హెచ్చరించారు. కార్మిక కోడ్లను వెనక్కి తీసుకునేదాకా ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకుసాగుతామని చెప్పారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ.. ఢిల్లీలో లాభాల్లో నడుస్తున్న రూ.16 వేల కోట్ల విలువైన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ సంస్థను ఓ వడ్డీ వ్యాపారికి నాలుగైదు వందల కోట్లకు కట్టబెట్టడమే దేశభక్తా? అని ప్రశ్నించారు. టాటాకు ఎయిర్స్లైన్ అప్పగించాక మన దేశం వాళ్లు సీఈఓలుగా పనికిరారని టర్కీ నుంచి పట్టుకొచ్చారనీ, ఇది దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం కాదా? అని నిలదీశారు. అంబానీ, ఆదానీ, టాటా, కార్పొరేట్లకు సంస్థలు అప్పగిస్తూ పోవటం, మతాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందటం బీజేపీకి అలవాటైపోయిందని విమర్శించారు. ఎక్కువ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించలేరనీ, చివరకు ఆ మత ఆయుధమే బీజేపీ కనుమరుగు లేకుండా చేస్తుందని హెచ్చరించారు.
ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ..2014లో 9.1 శాతంగా పీఎఫ్ వడ్డీని మోడీ సర్కారు క్రమంగా 8.1 శాతానికి తగ్గించిందని విమర్శించారు. వేతనాలు, ఇతర ప్రయోజనాల కోసం కాకుండా సింగరేణిలో మూడు రోజుల పాటు సంస్థను కాపాడుకునేందుకు సమ్మె చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశ సంపద కార్పొరేట్ల పాలు కాకుండా చేసేందుకే ఈ సార్వత్రిక సమ్మె అని నొక్కి చెప్పారు.
ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ..లండన్లో 67 కార్మిక చట్టాలుండగా..ఇక్కడ 44 ఉంటే మోడీ సర్కారుకు నొప్పేమి వచ్చిందని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో 6 నుంచి 8 చట్టాలున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం కార్మిక శాఖనే నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పనివిధానం అమలవుతున్నదన్నారు.
ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ..కార్మిక చట్టాల నిర్వీర్యం వల్లనే బోయగూడలో 11 మంది వలస కార్మికులు సజీవదహనం అయ్యారన్నారు. ఇన్స్పెక్టర్ల బాధ్యతలకు కత్తరేసి వారిని పరిశ్రమల అధినేతలకు సహాయకులుగా మార్చడం దుర్మార్గమన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు గమ్ముగా ఉండి ఆ తర్వాత నిత్యావసరాల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లను పెంచడం మోడీ సర్కారుకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు టి.శ్రీనివాస్ మాట్లాడుతూ..స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెట్టడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు తమ బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునేందుకు నోట్ల రద్దు ఉపయోగపడిందనీ, అదే సమయంలో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారని తెలిపారు. దేశంలో రిజర్వేషన్లే చేసే కుట్ర జరుగుతున్నదన్నారు.
ఏఐయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాబూరావు మాట్లాడుతూ..మత, కుల ఉన్మాదాల పేరుతో కార్మికులను చీల్చే కుట్రను మోడీ సర్కారు చేస్తున్నదని విమర్శించారు. మోడీ సర్కారు వచ్చాక దేశంలో అవినీతి, పేదరిక, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగాయని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ట్రేడ్ యూనియన్ల ఐక్యకార్యాచరణను వివరించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అనురాధ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.