Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పథకాలకు ఏపీ శ్రీకారం
- సర్కారు గరంగరం
- మూడు దశాబ్దాలుగా పెండింగ్
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వివాదం మరోసారి రాజుకుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గురు రాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టుతోపాటు మరో 13 చిన్న తరహా ఎత్తిపోతల పథకాలతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. తుంగభద్ర నది నుంచి అక్రమంగా 5.373 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖతోపాటు సాగునీటి రంగ నిపుణులు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కృష్ణానదీజలాల నిర్వహణ బోర్డు(కేఆర్ఎంబీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. అసలు వివాదం ఏంటీ, గతంలో సూచించిన పరిష్కారాలు ఏంటి ? అమలైన తీరు తదితర వివరాల్లోకి వెళితే...
రాజోలిబండ డైవర్షన్..బ్యారేజీ
1946లో ప్రారంభించిన ఈ పథకం 1958లో పూర్తిశారు. తుంగభద్ర నదిపై ఎడమవైపు కర్నాటక, కుడివైపున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఉన్నచోట ఈ ఈప్రాజెక్టును నిర్మించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 79 గ్రామాలు, గద్వాల తాలూకాలోని ఎనిమిది గ్రామాలకు 143వ కిలోమీటర్ కాలువకు నీటిని సరఫరా చేస్తున్నారు. 80 వేల ఎకరాలకు సాగునీటి లక్ష్యంతో 15.90 టీఎంసీలను కేటాయించారు. ఇందులో 6.51 టీఎంసీలు తుంగ భద్ర డ్యాం నుంచి, మిగిలిన 9.39 టీఎంసీలు తుంగభద్ర డ్యాం దిగువ క్యాచ్మెంట్ ఏరియా నుంచి నికరజలాలను అప్పట్లో కేటాయించారు. కానీ ఏనాడూ 15.90 టీఎంసీలు రాలేదు. చివరకు రాజోలిబండకు లోకలైజ్ చేసిన 30 వేల ఎకరాల ఆయకట్టును జురాలకు అనుబంధం చేశారు. అస్సలు జురాలకే కేటాయించిన 17.84 టీఎంసీలు మాత్రం వినియోగం కావడం లేదు. చివరకు జురాల నుంచి రామన్పాడ్కు లింకుపెట్టడం ద్వారా మహబూబ్నగర్, వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల పట్టణాలకు తాగునీటిని అందిస్తున్నారు. న్యాయంగా మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన నీటిని విడుదల చేయకుండా అన్యాయం చేశారు.
వివాదాలు ఉమ్మడి రాష్ట్రంలోని కర్నూలు-మహబూబ్నగర్ జిల్లాలు ఆర్డీఎస్పై ఘర్షణకు దిగాయి. ఒకవైపు కర్నాటకతో వివాదం నడుస్తుండగా, మరోవైపు తెలంగాణ, ఆంధ్ర తగాదాలు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వ ఉదాసీనవైఖరే ఇందుకు మూలం. ఈ ఘర్షణలతో కర్నాటక లబ్ధిపొందుతున్నదనే అభిప్రాయమూ ఉంది. 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సిన కర్నాటక, ఐదు నుంచి ఆరు టీఎంసీల వరకు వాడుకుంటున్నది. దీంతో రాష్ట్ర వాటా తగ్గింది. సుంకేశుల ఆనకట్టకు ఎగువన తుంగభద్ర నదిపైన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా రాజోలిబండ వద్ద 1947-58 మధ్య మరో ఆనకట్టని నిర్మించి, ఆర్డీఎస్ పేర కర్నాటకకు 5879 ఎకరాలకు, తెలంగాణలోని మహబూబ్నగర్కు 87,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ ఆనకట్ట నిర్మించిన చోట తుంగభద్ర నది ఎడమవైపు కర్నాటక, కుడివైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నా, ఆర్డీఎస్ కాలువ మాత్రం ఎడమవైపు 850 క్యూసెక్కుల ప్రవాహశక్తితో 143 కిలోమీటర్లు వెళ్లాలి. 1973, 1976లో కృష్ణాజలాల వివాదంలో జస్టిస్ బచావత్ తుంగభద్ర నీటి పంపిణీని కూడా చేర్చి కర్నాటక-తెలంగాణ నీరు ఎంతెంత వాడుకోవాలో తీర్పుచెప్పారు. ఆ తీర్పులో తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్(కర్నాటక) 0.49 టీఎంసీలు, తెలంగాణకు 6.51 టీఎంసీలు, కేసీ కెనాల్ 10.00 టీఎంసీలు కేటాయించారు. అలాగే తుంగభద్ర డ్యాం దిగువన క్యాచ్మెంట్ ఏరియా నుంచి కర్నాటక 0.71 టీఎంసీలు, తెలంగాణకు 9.39 టీఎంసీలు, కేసీ కెనాల్కు 29.90 టీఎంసీలు వాడుకోవచ్చని ఆ తీర్పులో పేర్కొన్నారు.
రాజోలిబండ-కేసీ కెనాల్కు తుంగభద్ర జలాల వినియోగం
తుంగభద్ర జలాల నుంచి రాజోలిబండ మళ్లింపు పథకానికి 17.10 టీఎంసీలు, కేసీ కెనాల్(కర్నూలు-కడప కాలువ)కు 39.90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బచావత్ తీర్పు చెప్పింది. తీర్పుకు భిన్నంగా నీటి వినియోగమ వుతున్నది. కర్నాటక మాత్రం మించి వాడుకుంది. ఈ జల పంపిణీని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన 15.90 టీఎంసీల వాటా మాత్రం రాలేదు. నీటి వినియోగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. అందుకే మహబూబ్నగర్కు అవకాశాలుండి కరువు జిల్లాకు మారింది. కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జురాల నుంచి మహబూబ్నగర్ జిల్లాకు 17.84 టీఎంసీలు కేటాయించారు. 1.02 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి జురాల-రాజోలిబండ లింక్ కెనాల్ తవ్వి జురాల నీటిని రాజోలిబండ ఆయకట్టు 30వేల ఎకరాలకు మళ్లిస్తున్నారు. కాగా జురాల ఆయకట్టుకు మాత్రం నీరందడంలేదు. గత సంవత్సరం వరకు 12 టీఎంసీలకు మించి వాడకపోవడం తెలిసిందే.
రాజోలిబండ సాగు లక్ష్యం
ఆర్డీఎస్ నుంచి 850 క్యూసెక్కుల నీరు ప్రవహించి కర్నాటకలోని రాయచూరు జిల్లాకు, తెలంగాణలోని మమహబూబ్నగర్ జిల్లాకు బచావత్ తీర్పు ప్రకారం సాగునీరివ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. కర్నాటక తన వాటా 1.2 టీఎంసీలకు మించి 4.5 టీఎంసీల నుంచి 5.60 టీఎంసీల వరకు అధికంగా వాడుకుంటున్నది. గత 18 ఏండ్లుగా 470 శాతం నీటిని వాడుతూ తన 5879 ఎకరాలకు మించి సాగునీటి సౌకర్యం కల్పించుకుంది. 15.90 టీఎంసీలు వాడుకుని 87,500 ఎకరాల సాగుకావాల్సిన మహబూబ్నగర్ జిల్లాకు మాత్రం అన్యాయమే జరుగుతున్నది. 1976 నుంచి 1987 వరకు సగటున 50,624 ఎకరాలకు 12 టీఎంసీలే వినియోగమయ్యాయి. 1988 నుంచి 2002-03 వరకు 37,990 ఎకరాలకు 6.65 టీఎంసీల నీరే వినియోగించినట్టు రాష్ట్ర సాగునీటిశాఖ చెబుతున్నది. ఆర్డీఎస్కు మొదట 850 క్యూసెక్కులు విడుదల చేస్తే, తెలంగాణకు చేరేవరకు 771 క్యూసెక్కులే వస్తుంది. ఆ వచ్చిన నీటిని సక్రమంగా వాడుకోవడానికి కాలువలు అందుకు తగినట్టుగా లేవు. కాలువ వెడెల్పు, ఎత్తు, గేట్ల నిర్మాణంలో జరిగిన తగ్గింపు మూలంగా మహబూబ్నగర్ 15.90 టీఎంసీల తన వాటాను ఎప్పుడూ నష్టపోతూనే ఉంది.
ఇప్పటికైనా...
దశాబ్ధాల తరబడి తుంగభద్ర నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడిరాష్ట్రంతోపాటు తెలంగాణ ఆవిర్భావం తర్వాతా ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. కేఆర్ఎంబీతో విస్త్రృత సంప్రదింపులు చేయాలని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కోసం తుంగభద్ర బోర్డు ఏర్పాటైంది. నీటిని పర్యవేక్షించడం దీని పని. కానీ, ఇంతవరకూ అది జరగలేదు. మహబూబ్నగర్కు నీళ్లే రాలేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి తన రాజకీయ పలుకుబడితో మహబూబ్నగర్కు నీళ్లు రాకుండా చేశారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇంతకాలం నుంచి జరుగుతున్న అన్యాయాన్నీ ఇప్పటికైనా గట్టిగా ప్రశ్నించాలి. కేసీ కెనాల్కు వెళ్లే నీళ్లను నిరోధించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలనే డిమాండ ముందుకు వస్తున్నది.