Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి ఉదయం 8 నుంచి 11.30 వరకే నిర్వహణ
- పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల పనివేళలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గురువారం నుంచి ఉదయం ఎనిమిది నుంచి 11.30 గంటల వరకే బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నుంచి వచ్చేనెల ఆరో తేదీ వరకు ఉదయం 11.30 గంటల వరకే పాఠశాలల్లో విద్యార్థులకు తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకే మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలను ప్రభుత్వం కుదించింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు.